దర్వాజ-లక్నో
Samajwadi Party patriarch Mulayam Singh: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. అక్టోబర్ 10, సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. అంతకుముందు, ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రిలో ఐసీయూకి తరలించారు. 82 ఏండ్ల ములాయం సింగ్ యాదవ్.. అనారోగ్యంతో మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు.
ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడని ఆస్పత్రి వర్గాలు అంతకుముందు తెలిపాయి. మేదాంత ఆసుపత్రిలో అంతర్గత వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారు. సింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్తో కూడా బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అక్టోబరు 2న ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకి తరలించారు. ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన భార్య డింపుల్తో కలిసి గురుగ్రామ్ ఆసుపత్రికి చేరుకున్నారు.
అక్టోబరు 9, ఆదివారం, మేదాంత హాస్పిటల్ ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి చాలా విషమంగా ఉందనీ, ఆయన ప్రాణాలను రక్షించే మందులతో ఉన్నారని పేర్కొంటూ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. తాజాగా ఆయన మరణ వార్తను మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో ధృవీకరించారు. “గౌరవనీయులైన నా తండ్రి, అందరి నాయకుడు ఇక లేరు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
मेरे आदरणीय पिता जी और सबके नेता जी नहीं रहे – श्री अखिलेश यादव
— Samajwadi Party (@samajwadiparty) October 10, 2022
నవంబర్ 22, 1939లో జన్మించిన ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. సాధారణ కార్యకర్త నుంచి ఎన్నో పదవులు అలంకరించిన నేతగా ములాయం సింగ్ యాదవ్ ఎదిగారు. కాగా, ఈ ఏడాది జూలైలో, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గురుగ్రామ్లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ములాయం సింగ్ భార్య సాధనా గుప్తా మరణించారు.