దర్వాజ-కర్నూలు
Kurnool: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కర్నూలు జిల్లాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. అధికార వికేంద్రీకరణ అంశం, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ.. బాబు తీరుపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కర్నూలులో న్యాయవాదులు ధర్నాకు దిగి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాయలసీమలో న్యాయ రాజధానికి అంగీకరించాలని నాయుడును డిమాండ్ చేశారు. ఈ ఘటనతో పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.
కాగా, చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహి అని ఆరోపించారు. కర్నూలులో బెంచ్ కావాలని డిమాండ్ చేసింది తానేనని వెల్లడించారు. ప్రాంతాల మధ్య చిచ్చు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడబోనని, ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.