దర్వాజ-న్యూఢిల్లీ
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘భారత్ జోడో యాత్ర’ మహారాష్ట్రలో ముగిసింది. నవంబర్ 23న ఈ పాదయాత్ర మధ్యప్రదేశ్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. సీనియర్ పార్టీ నాయకుడు జైరాం రమేష్ ప్రకారం.. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మధ్యప్రదేశ్ లో కొనసాగే భారత్ జోడో యాత్రలో పాలుపంచుకొనున్నారు. ఈ యాత్ర మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్లోకి ప్రవేశించినప్పుడు నాలుగు రోజుల పాటు పాదయాత్రలో పాల్గొననున్నారు. ప్రియాంక గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు కర్ణాటకలో జరిగిన యాత్రలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు.
బుర్హాన్పూర్ సమీపంలో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించిన యాత్ర బుధవారం తిరిగి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్లో తెలిపారు. “ప్రియాంక గాంధీ అక్కడ యాత్రలో పాల్గొంటారు. నాలుగు రోజుల పాటు పాదయాత్ర పాల్గొంటారు” అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి హిందీ ట్వీట్లో తెలిపారు. ప్రియాంక గాంధీ నవంబర్ 23న మధ్యప్రదేశ్లో అడుగుపెడతారని, అయితే నవంబర్ 24 నుంచి యాత్రలో పాల్గొంటారని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. బుర్హాన్పూర్ నుండి ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్ర డిసెంబర్ 5న రాజస్థాన్లోకి ప్రవేశించే ముందు ఖాండ్వా, మోవ్, ఇండోర్, ఉజ్జయినితో సహా మధ్యప్రదేశ్లోని ఇతర జిల్లాల వైపు కదులుతుంది.
రాహుల్ గాంధీ ఖాండ్వాలోని ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహాకాళేశ్వర్ అనే రెండు జ్యోతిర్లింగ మహాదేవ్ ఆలయాలను సందర్శించనున్నట్లు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాబిన్హుడ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడే తాంతియా మామా జన్మస్థలాన్ని కూడా రాహుల్ గాంధీ సందర్శించే అవకాశం ఉంది. నవంబర్ 29న ఇండోర్లో రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం నిర్వహించనుండగా, నవంబర్ 30 నుంచి డిసెంబర్ 1 మధ్య ఉజ్జయినిలో మెగా బలప్రదర్శన కోసం కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల అభిప్రాయం ప్రకారం.. భారత్ జోడో యాత్ర నిమాడ్-మాల్వా బెల్ట్ నుండి దాటుతుందంటే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. “ఈ బెల్ట్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. 22 అసెంబ్లీ స్థానాలు ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కూడా మేము సన్నద్ధమవుతున్నాము” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.
భారత్ జోడో యాత్ర డిసెంబర్ 5న రాజస్థాన్లోని ఝలావాడ్లోకి ప్రవేశించడానికి ముందు దాదాపు 15 రోజుల పాటు మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. నవంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుండి రాహుల్ గాంధీ అనేక మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. ఇప్పటివరకు, పార్టీ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర సహా దేశంలోని ఆరు రాష్ట్రాలలో ముందుకుసాగింది.
