దర్వాజ-హైదరాబాద్
PAN-Aadhaar linking: పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే గడువును 2023 జూన్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుత గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగియనుండగా, పాన్ ను ఆధార్ తో లింక్ చేయడానికి పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకెళ్తే.. పన్ను చెల్లింపుదారులకు మరికొంత సమయం ఇవ్వడానికి, పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానించే తేదీని జూన్ 30 వరకు పొడిగించింది. గతంలో మార్చి 31 వరకు గడువు ఉండేది. ఆదాయపు పన్ను శాఖ మంగళవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, జూన్ 30 వరకు, ప్రజలు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోకుండా పాన్-ఆధార్ అనుసంధానం కోసం తమ ఆధార్ వివరాలను నిర్దేశిత అథారిటీకి తెలియజేయవచ్చు.
అయితే జూలై 1 నుంచి లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవని పేర్కొంది. రుసుము రూ.1,000 ఫీజు చెల్లించి నిర్దేశిత అథారిటీకి ఆధార్ ను తెలియజేసిన తర్వాత 30 రోజుల్లో పాన్ కార్డును తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. పనిచేయని పాన్ కార్డులపై ఎటువంటి రిఫండ్ చేయబడదు, పాన్ పనిచేయని కాలానికి అటువంటి రీఫండ్ పై వడ్డీ చెల్లించబడదు. టీడీఎస్, టీసీఎస్ అధిక రేటుతో మినహాయించబడతాయి.