దర్వాజ-ఇంఫాల్
Manipur Violence: మణిపూర్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 54 కు పెరిగింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి ఆర్మీ చర్యలు చేపట్టింది. దాదాపు అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం మణిపూర్ హింసలో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 54కు చేరుకుంది. అయితే, అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 100కు పైగా ఉంటుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
మణిపూర్ హింస నేపథ్యంలో రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎన్పీఎఫ్, ఎన్పీపీ, సీపీఐ(ఎం), ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన వంటి రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ప్రతి నియోజకవర్గంలో శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, నీట్ యూపీ పరీక్షలను వాయిదా వేశారు. మణిపూర్ లో కొనసాగుతన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న వారి సంఖ్య పెరుగుతున్నదని సమాచారం.