Karnataka election 2023: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. హంగ్ దిశ ఫలితాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా.. కన్నడ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కే జై కొట్టారు. కాంగ్రెస్ కే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి హస్తం పార్టీ తన దూకుడును కనిబరుస్తూ వచ్చింది. ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు.. దాదాపు 126 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తుంది.
మరోవైపు బీజేపీ పరిస్థితి దారుణంగా మారింది. సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి.. అధికారం దక్కించుకోవాలని భావించిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. 60 స్థానాల్లోనే లీడ్ లో ఉంది. ఇక జేడీఎస్ పరిస్థితి మరీ దారుణం. రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. కేవలం 22 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 4 చోట్ల ముందంజలో ఉంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 8చోట్ల, బీజేపీ 4 స్థానాల్లో గెలిచిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఎలాగైనా అధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని భావించినా బీజేపీ కలలు కల్లలయ్యాయి. స్వయంగా ప్రధాని మోడీనే కదన రంగంలోకి దిగినా ఫలితాలు సానుకూలంగా రాలేదు. పైగా.. బీసీలు, దళితులు, మైనారీలు ఉన్న ప్రాంతాలన్నీ కాంగ్రెస్, జేడీఎస్ ఖాతాలోనే వచ్చాయి.
ఇక హెచ్ దేవేగౌడ సారథ్యంలోని జేడీఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కింగ్ మేకర్లాం.. మేమే కింగులాం అని తెగ వీరవిగిన కుమారస్వామికి భంగపాటు తప్పలేదు. ఈ ఫలితాలపై సీఎం బస్వరాజ్ బొమ్మె స్పందిస్తూ.. ఓటమిని అంగీకరించారు. ప్రజా నిర్ణయాన్ని అంగీకరిస్తున్నామని, తాము ప్రజలకు చేరువ కాలేకపోయామని చెప్పుకొచ్చారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. న్యూఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీసులో పండుగ వాతావరణం నెలకొంది. రేపు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉంటుందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. అయితే.. సీఎం కూర్చీలో ఎవరు కూర్చోబోతున్నారనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది. మరీ కాంగ్రెస్ అధిష్టానం ఏం నిర్ణయిస్తోంది. ఇంకా వేచిచూడాలి.