దర్వాజ-హైదరాబాద్
Telangana Minister KTR: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాజకీయాలను ఎప్పుడూ సీరియస్ గా తీసుకోరనీ, రాజకీయ పార్టీని నడపడానికి బదులు ఎన్జీవోను ప్రారంభించాలని తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఉండి భారత్ జోడో యాత్రను కొనసాగించడం ద్వారా రాహుల్ గాంధీకి రాజకీయాలపై చిత్తశుద్ధి లేదని స్పష్టమైందని కేటీఆర్ అన్నారు. సీరియస్ రాజకీయాలు చేయకుండా అమెరికాలో మొహబ్బత్ కీ దుకాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంగ్రెస్ నేతను మంత్రి తప్పుబట్టారు.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై స్పందించిన కేటీఆర్.. భారతీయ జనతా పార్టీ వైఫల్యమే విజయానికి దారితీసిందనీ, ఈ విజయంలో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని అన్నారు. బీజేపీ అసమర్థతను, అవినీతిని కర్ణాటక ప్రజలు తిరస్కరించారనీ, రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవన్నారు. భారతదేశానికి ఎన్నికలు, ఎంపిక అవసరం, తిరస్కరణ కాదు. అయితే దురదృష్టవశాత్తూ కర్ణాటక ప్రజలకు అవకాశాలు తక్కువగానే మిగిలాయని అన్నారు.
తెలంగాణ మోడల్ ను ఇతర రాష్ట్రాలకు పరిచయం చేయడమే బీఆర్ఎస్ ఎజెండా అని కేటీఆర్ అన్నారు. గత 70 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ విఫలమైందనీ, ప్రతిపక్షంగా కూడా ఆ పార్టీ ప్రత్యామ్నాయ నమూనాను రూపొందించలేదని ఆయన విమర్శించారు.