దర్వాజ-విజయవాడ
Chandrababu Naidu arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన కుట్రదారు అని ఏపీ సీఐడీ పేర్కొంది. చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఐడీ స్పందిస్తూ నంద్యాలలో ఉదయం 6 గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయణ్ని ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు.
రూ.550 కోట్ల అక్రమాలు..
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగింది. ఇందులో రూ.550 కోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించాం. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.371 కోట్లు.. డిజైన్ టెక్ సహా ఇతర షెల్ కంపెనీలకు వెళ్లినట్టు తేలింది. సీమెన్స్ తరఫున డిజైన్ టెక్ అనే సంస్థ ద్వారా లావాదేవీలు జరిగాయి. ఒప్పందం జరిగే సమయానికి డిజైన్ టెక్ అనే సంస్థ లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గంటా సుబ్బారావును నియమించారు. ఆయనకు 4 పదవులు ఇచ్చారని గుర్తించినట్టు తెలిపారు.
నారా లోకేశ్ పాత్రపై దర్యాప్తు
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో షెల్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడిన వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు ప్రధాన కుట్రదారు. వికాస్ కన్వెల్కర్ సహా ఇతర నిందితులు ఈ అక్రమాల్లో నిందితులుగా ఉన్నారు. ఈ కేసుల్లో చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక కుంభకోణంలో అప్పటి కార్యదర్శితో పాటు చంద్రబాబు తనయుడి పాత్ర పైనా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉంది అందుకే ఆయన అరెస్టు అనివార్యం అయిందని తెలిపారు.
కేబినెట్ ఆమోదం కూడా లేదు..
సిమెన్స్ సంస్థ నుంచి రూ.550 కోట్లు పెట్టుబడి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం జీవోల ద్వారా రూ.371 కోట్లు ఇచ్చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదు. రూ.540 కోట్ల వ్యయం అయ్యే 6 సెంటర్ ఆఫ్ ఎక్లెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. రూ.3 వేల కోట్లతో అన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ.58 కోట్లతో సాఫ్ట్వేర్ను కొనుగోలు చేశారు. దాన్నే బాగా పెంచి చూపించి కుట్రకు పాల్పడ్డారు. డిజైన్ టెక్కు చెందిన మనోజ్ పర్దాసాని, అలాగే చంద్రబాబు కార్యదర్శి శ్రీనివాస్ కూడా పరారీలో ఉన్నారన్నారు.
దుబాయి, అమెరికాకు వెళ్తున్నాం..
ఈ కేసుకు సంబంధించి సీఐడీ బృందాలు దుబాయి, అమెరికాకు వెళ్తున్నాయి. ఈ కేసులో రాజేశ్, నారా లోకేశ్ పాత్రలు ఎంత ఉన్నాయన్నది తెలుస్తం. ఏపీ ఫైబర్ నెట్తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో లోకేశ్ పాత్రపైనా విచారణ చేస్తాం. ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పరుస్తాం. ఆయణ్ని విజయవాడకు తీసుకురావడానికి హెలికాప్టర్ సిద్ధం చేశాం.. అయితే దాన్ని ఆయన వద్దన్నారు. అయన వయసు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. స్కిల్ డెవలపెంట్ కేసులో అంతిమ లబ్దిదారు చంద్రబాబే. ఆయన కీలక పాత్రధారి కాబట్టే అరెస్టు చేశామని సీఐడీ చీఫ్ వివరించారు.