హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది సజీవ దహనం
దర్వాజ-హైదరాబాద్
Nampally fire Accident : హైదరాబాద్లోని నాంపల్లిలోని ఓ భవనంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించి 9 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో తొలుత మంటలు చెలరేగాయి. తర్వాత మిగిలిన అంతస్తులకు విస్తరించాయి. గ్రౌండ్ ఫ్లోర్లో రసాయనాలు నింపిన డ్రమ్ములను భద్రపరిచారు. దీంతో మంటలు త్వరగా భవనాన్ని చుట్టుముట్టాయి.
భవనం నుంచి ఇప్పటి వరకు 20 మందిని సురక్షితంగా బయటకు తీశారు. వీరిలో పది మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు అగ్నిమాపక దళం సీనియర్ అధికారి తెలిపారు. మరణించిన వారిలో ఎక్కువ మంది మొదటి, రెండవ అంతస్తులో నివసిస్తున్న అద్దెదారులు. మూడు, నాలుగో అంతస్థుల్లో నివాసం ఉంటున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మేడమీద ఉన్నవారిని కిటికీల ద్వారా బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
భవనం యజమాని రమేష్ జైస్వాల్గా గుర్తించారు. అతనికి పలు రసాయనాల ప్యాక్టరీలు ఉన్నాయని సమాచారం. పై అంతస్తులను అద్దెకు తీసుకుని ఆయిల్ డ్రమ్ములు, డబ్బాలు నిల్వ చేసేందుకు గ్రౌండ్ ఫ్లోర్ను గోదాంలా వాడుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత పారిపోయిన అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ప్రమాదం జరగడానికి కారణం ఇదే..
గ్రౌండ్ ఫ్లోర్లో ఓ కారు రిపేరు జరుగుతోంది. కెమికల్ డ్రమ్కు స్పార్క్ తగిలి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కానీ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం, దాని వల్ల సంభవించిన నష్టం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కెమికల్ మంటల్లో ఉందని, ఎంత నీరు పోసినా చల్లారలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం 9.35 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనేక అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించాయి.
Share this content: