- మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు
- మూడు నెలల వ్యవధిలోనే రూ.225 వడ్డన
- 30 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెరిగిన వంటగ్యాస్ ధరలు
దర్వాజ-న్యూఢిల్లీ: ఇదివరకు దేశంలో ఎప్పుడులేని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుతూ వినియోగదారుల నడ్డి విరిస్తున్నాయి. ఓ వైపు నిత్యావసరాల ధరలు సైతం ఆకాశమే హద్దుగా పెరుగుతూ సమాన్యులపై భారం మోపుతుండగా.. మరో వైపు వంట గ్యాస్ సిలింగర్ (ఎల్పీజీ సిలిండర్) ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ వంటింట్లో సెగలు పుట్టిస్తున్నాయి.
గత నెలలో మూడు సార్లు పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధరలు తాజాగా ఈ నెలలో మొదటి రోజునే (మార్చి 1 సోమవారం) పెరిగాయి. నాలుగు రోజుల ముందు సిలిండర్పై రూ.25 పెంచిన చమురు కంపెనీలు తాజాగా మరో రూ.25 పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.819 కి పెరిగింది. ఇక కమర్షియల్ గ్యాస్పై రూ.95 వడ్డించాయి. దీంతో వాణిజ్య అవసరాలకోసం వినియోగించే సిలిండర్ ధర రూ.1614కు చేరింది.
కాగా, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు సిలిండర్ ధరలు పెరిగాయి. మొత్తంగా గత మూడు నెలల వ్యవధిలో (డిసెంబర్ నుంచి ఈ మార్చి 1 వరకు) గృహవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.225 పెరిగాయి. డిసెంబర్ 1న 14.2 కిలోల వంటగ్యాస్పై రూ.50 పెంచడంతో రూ.594గా ఉన్న సిలిండర్ ధర రూ.644కు చేరింది. ఇక ఈ ఏడాది జనవరిలో 1న మళ్లీ రూ.50 భారం మోపడంతో రూ.694కు పెరిగింది.

ఇక ఆ తర్వాతి నెల (ఫిబ్రవరి)లో ఏకంగా మూడు సార్లు సిలిండర్ ధరలు పెరిగాయి. ఫిబ్రవరి 4న రూ.25 పెంచడంతో సిలిండర్ ధర రూ.719కి చేరింది. మళ్లీ 10 రోజుల వ్యవధిలో 14న రూ.50 పెంచడంతో రూ.769 ధర చేరింది. అదే నెలలో మళ్లీ 25న రూ.25 పెంచడంతో వంటగ్యాస్ ధర రూ.794కు చేరింది. తాజాగా ఈ నెల ప్రారంభంలోనే మరో రూ.25 వడ్డించడంతో వంటగ్యాస్ ధర రూ.819 కి పెరిగింది.
ఇదిలా ఉండగా దేశంలో చమురు ధరలతో పాటు వంటగ్యాస్ ధరలు, వంట నూనెలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సామాన్యులు వాపోతున్నారు. ఇక ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మాటాల తూటాలు పేలుస్తూ.. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ పై పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు నిత్యావసరాల ధరలను అదుపులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?
అందానికి.. ఆరోగ్యానికి గోరింటాకు !