దర్వాజ-క్రికెట్
T20 World Cup 2024 Top 10 Moments: టీ20 ప్రపంచ కప్ 2024 థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. మొత్తం టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీ20 ప్రపంచకప్ ట్రోఫీని భారత్ గెలుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ టీ20 ప్రపంచకప్ అనేక చిరస్మరణీయ క్షణాలను అందించింది. ఇందులో అమెరికా జట్టు సెమీ-ఫైనల్కు చేరడం ఏవరూ ఊహించలేదు. టీ20 ప్రపంచ కప్ 2024 లోని టాప్-10 బిగ్ మూవ్మెంట్స్ గమనిస్తే..
1. పాకిస్థాన్పై అమెరికా అద్భుత విజయం
తొలిసారిగా వెస్టిండీస్తో సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్న అమెరికా.. డల్లాస్లో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్లో మాజీ చాంపియన్ పాకిస్థాన్ను ఓడించి సంచలనం సృష్టించింది. హారీస్ రవూఫ్ వేసిన చివరి బంతికి అమెరికా బ్యాట్స్మెన్ నితీష్ కుమార్ ఫోర్ కొట్టి పాకిస్థాన్ స్కోరును సమం చేశాడు. దీంతో సూపర్ ఓవర్ కు మ్యాచ్ వెళ్లగా, సూపర్ ఓవర్లో పాకిస్థాన్ను ఓడించి అమెరికా క్రికెట్ ప్రపంచంలో అతిపెద్ద సంచలనాన్ని నమోదుచేసింది.
2. క్లిష్టమైన పిచ్పై చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను భారత్ షాక్
న్యూయార్క్లోని ఫాస్ట్ బౌలర్లకు అనుకూలమైన పిచ్పై భారత జట్టు 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ప్రతిస్పందనగా, పాకిస్తాన్ సులభమైన విజయం వైపు కదులుతోంది, కానీ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ ముందు, వారి జట్టు లక్ష్యానికి ఆరు పరుగుల దూరంలో మిగిలిపోయింది.
3. భారత జట్టుకు అమెరికా గట్టి సవాల్ విసిరింది
పాకిస్థాన్ను ఓడించి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న అమెరికా జట్టు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో భారత్కు గట్టి పోటీనిచ్చింది. అర్ష్దీప్ సింగ్ (తొమ్మిది పరుగులకు నాలుగు వికెట్లు) అద్భుత బౌలింగ్ ముందు అమెరికా జట్టు కేవలం 110 పరుగులకే ఆలౌటైంది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 39 పరుగుల వద్ద రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వికెట్లను కోల్పోయింది. బ్యాట్స్మెన్ కష్టతరమైన పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు.
4. సెమీ ఫైనల్స్కు చేరిన ఆఫ్ఘనిస్తాన్
గ్రూప్ దశలో న్యూజిలాండ్ను ఓడించిన తర్వాత, సూపర్-8లో బంగ్లాదేశ్ను అత్యంత తక్కువ స్కోరింగ్ మ్యాచ్లో ఎనిమిది పరుగుల తేడాతో ఓడించి ఆఫ్ఘనిస్తాన్ మొదటిసారి టీ20 ప్రపంచ కప్లో సెమీ-ఫైనల్కు అర్హత సాధించింది. అయితే, దీనికి ముందు, ఈ ఫార్మాట్లో జట్టు తన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది అదే ఆస్ట్రేలియాను ఓడించడం. దీంతో ప్రపంచ క్రికెట్లో తాము ఇక బలహీన జట్టు కాదని రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ జట్టు నిరూపించింది.
5. ఆస్ట్రేలియాపై రోహిత్ ధనాధన్ బ్యాటింగ్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్లో అత్యంత దూకుడుగా ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియాపై 41 బంతుల్లో 92 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ బ్యాటింగ్ ముందు ఆస్ట్రేలియా బౌలర్లు, ముఖ్యంగా మిచెల్ మార్ష్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్ ను కన్ఫార్మ్ చేసుకుంది.
6. అదరగొట్టిన ఆఫ్ఘన్
ఎన్నో విజయాలను నమోదు చేసి సెమీఫైనల్కు చేరిన అఫ్గానిస్థాన్ జట్టు కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. దీని కారణంగా జట్టు తన అద్భుతమైన ప్రారంభాన్ని కోల్పోయింది. సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయి మెగా టోర్నీ నుంచి ఔట్ అయింది. కానీ, ఆఫ్ఘన్ ఆట అందరిని మెప్పించింది.
7. కుల్దీప్, అక్షర్ ముందు మోకరిల్లిన ఇంగ్లండ్ బ్యాటర్స్
ప్రపంచకప్లో అద్భుతంగా సారథ్యం వహించిన రోహిత్ నైపుణ్యంతో కూడిన కెప్టెన్సీకి ఇంగ్లండ్ వద్ద సమాధానం లేదు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన బ్యాటింగ్ తర్వాత, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫాస్ట్ బౌలర్లపై దూకుడు వైఖరిని అవలంబించినప్పుడు, రోహిత్ బంతిని అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లకు అందించాడు. ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్లు తమ స్పిన్తో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లను తమ బౌలింగ్ మాయతో బోల్తా కొట్టించి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ విజయంతో 12 నెలల్లోనే మూడోసారి ఐసీసీ టోర్నీలో భారత్ ఫైనల్ చేరింది.
8. ఫైనల్లో దుమ్మురేపిన విరాట్ కోహ్లి
టోర్నీ మొత్తం ప్రపంచకప్లో పరుగులు సాధించాలని తహతహలాడుతున్న విరాట్ కోహ్లీ, జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో బ్యాట్తో టైటిల్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 59 బంతుల్లో 76 పరుగుల చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ప్లేయింగ్ ఎలెవన్లో తాను ఉండటంపై వచ్చిన విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు.
9. సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్..
ప్రపంచ కప్ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కోహ్లి అద్భుతంగా పునరాగమనం చేశాడు, అయితే ఒత్తిడి పరిస్థితుల్లో ఫీల్డింగ్లో సూర్యకుమార్ అందుకున్న క్యాచ్ క్రికెట్ హిస్టరీలో నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాకు చివరి ఓవర్లో 16 పరుగులు మాత్రమే కావాల్సిన సమయంలో డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతమైన క్యాచ్ పట్టాడు. సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఈ క్యాచ్ 1983లో భారత్కు వన్డే ప్రపంచకప్ను అందించిన కపిల్ దేవ్ క్యాచ్ను గుర్తు చేసింది.
10. టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కోహ్లి-రోహిత్
టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో గెలిచిన తర్వాత కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకుంటూ టీ20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అలాగే, రోహిత్ శర్మ కూడా పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఈ ఫార్మాట్లో దాదాపు 15 ఏళ్ల కెరీర్లో ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. వీరితో పాటు భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 ఇంటర్నేషనల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.