Miss World 2025: తెలంగాణ రాజధాని హైదరాబాద్ మే 10 నుంచి 31 వరకు జరిగే 72వ మిస్ వరల్డ్ 2025 పోటీకి ఘన ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మే 5న ఐసీసీసీ (Integrated Command and Control Center) లో ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
భద్రతలో ప్రత్యేక చర్యలు
విదేశాల నుంచి వచ్చే అతిథుల హోటళ్లలో భద్రత పెంచాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సచివాలయం వంటి ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
116 దేశాల నుంచి యువతులు – ప్రపంచ దృష్టి తెలంగాణపై
ఈ పోటీలో 116 దేశాల యువతులు పాల్గొనబోతుండగా, భారతదేశం సహా 3,000పైగా మీడియా ప్రతినిధులు ఈ ఈవెంట్ను కవర్ చేయనున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం ఇది కాబట్టి, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సీఎం స్పష్టం చేశారు.
పర్యటనలతో సంస్కృతి పరిచయం
పోటీకి వచ్చిన అందాల రాణులు చార్మినార్, లాడ్ బజార్, తెలంగాణ తల్లి విగ్రహం, ఇతర పర్యాటక ప్రదేశాలు సందర్శించనున్నారు. అలాగే ఇండిరా క్రాంతి పథకం మహిళల స్వయం సహాయక బృందాల నిర్వహణలో ఉన్న డబ్ల్యుసీఆర్ఏ బజార్ సందర్శన, ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్ వీక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
విద్యార్థులకు అరుదైన అవకాశం
BC, SC, ST, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా బాలికా పాఠశాలలు విద్యార్థులకు ఒకరోజు ఈ పోటీని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు.
వాతావరణంపై అప్రమత్తత – GHMC, HYDRAAకి స్పెషల్ అలర్ట్
అకస్మాత్తుగా వర్షాలు, గాలులు బలంగా వచ్చే అవకాశాల నేపథ్యంలో GHMC, HYDRAA ఏర్పాట్లకు సిద్ధంగా ఉండాలని, ట్రాఫిక్, పవర్ కట్ సమస్యలు రాకుండా ప్లాన్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఘనంగా ఆరంభోత్సవం – ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఆహ్వానం
పోటీ ప్రారంభోత్సవానికి సినీ, క్రీడా, సాహిత్య, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించాలన్నారు. అంతేగాకుండా హైదరాబాద్ నగరమంతా హోర్డింగ్స్, ఆర్చ్లతో అందంగా అలంకరించాలన్నారు.