Breaking
Thu. Jun 26th, 2025

IPL 2025: ఉద్రిక్తతల నడుమ నిలిచిపోయిన ఐపీఎల్ 2025

Sun Risers Hyderabad (Photo Credit: X/ SunRisers Hyderabad

Darvaaja – Hyderabad


IPL 2025: భారత క్రికెట్ అభిమానులకు ఇది ఒక పెద్ద షాక్. క్రికెట్ పండుగగా భావించే ఐపీఎల్ సీజన్ తన ఉత్కంఠభరిత దశలో ఉండగానే బీసీసీఐ టోర్నీని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం ఎదుర్కొంటున్న భద్రతా పరిస్థితులు, ఈ నిర్ణయానికి ప్రధాన కారణం.

గురువారం రాత్రి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఆకస్మాత్తుగా రద్దయింది. తొలుత వాతావరణ కారణంగా ఆగిందనుకున్న మ్యాచ్, నిజానికి భద్రతా హెచ్చరికలు కారణంగా నిలిపివేయబడి ఉండటం వెలుగులోకి వచ్చింది.

పంజాబ్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో “Match has been called off” అని వెల్లడించగా, అభిమానులు స్టేడియం వెలుపల “పాకిస్తాన్ ముర్దాబాద్” నినాదాలతో త‌మ అసహనాన్ని వ్యక్తపరిచారు.


భద్రతా హెచ్చరికలు – సైన్యం అప్రమత్తం

మే 8 మరియు 9 మధ్య రాత్రి పాకిస్తాన్ సాయుధ దళాలు జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో అనేక డ్రోన్ మరియు ఆయుధ దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడులు పశ్చిమ సరిహద్దు మరియు ఎల్ఓసీ (LOC) వెంబడి జరగడం గమనార్హం.

భారత సైన్యం మరియు వైమానిక దళం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. వీటిలో ఐదు దశాబ్దాల స్వదేశీ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన ఆకాష్ మిస్సైల్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది.

ఆకాష్ మిస్సైల్ వ్యవస్థ – దేశ భద్రతకు కంచు కవచం

భారతీయుల స్వదేశీ విజ్ఞానాన్ని చాటే ఆకాష్ వ్యవస్థ, డ్రోన్, క్రూయిజ్ మిస్సైల్, ఇతర వైమానిక ముప్పుల నుండి దేశాన్ని కాపాడడంలో అద్భుతంగా పనిచేసింది. ఈ వ్యవస్థ:


మధ్య-శ్రేణి పరిధిలో కార్యకలాపాలు చేస్తుంది

ఏ దిశ నుంచైనా వచ్చే బహుళ లక్ష్యాలను ఒకేసారి ఎదుర్కొంటుంది

ఫేజ్డ్ అర్రే గైడెన్స్ రాడార్ ఆధారంగా మిస్సైల్ లక్ష్యాన్ని ఛేదిస్తుంది

గ్రూప్ అండ్ ఆటోనమస్ మోడ్ లో పనిచేస్తుంది


ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా దేశవ్యాప్తంగా భారత సైన్యం,ఎయిర్ ఫోర్స్ దీనిని సరిహద్దు వెంబడి మోహరిస్తున్నాయి.


50కి పైగా డ్రోన్లు కూల్చివేత – శత్రు కుతంత్రాలకు చెక్

భారత సైన్యం ప్రతి-డ్రోన్ ఆపరేషన్ లో భాగంగా 50కి పైగా పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేసింది. మే 7-8 రాత్రి ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అనేక సైనిక స్థావరాలపై జరిపిన దాడులను విజయవంతంగా తిప్పికొట్టారు. అంతేగాక, లాహోర్‌లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ను కూడా భారత సైన్యం నిర్వీర్యం చేసింది.



ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం శ్రేయస్కరమని చెప్పవచ్చు. దేశ భద్రతకు మించినది మరొకటి ఉండదనే సూత్రానికి ఈ నిర్ణయం నిలువెత్తు నిదర్శనం. ఐపీఎల్ అభిమానులు కొంత నిరాశ చెందినా, జవాన్ల ధైర్యాన్ని చూసి గర్వపడకమానరు.

భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రీడా ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఐపీఎల్ 2025 నిలిచిపోవడం భారతదేశ భద్రతకు ఉన్న ప్రాధాన్యతను రుజువు చేస్తోంది. పరిస్థితులు సాధారణంగా మారిన తరువాత టోర్నీ మళ్లీ కొనసాగించే అవకాశంపై బీసీసీఐ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.

By Nikhila

Related Post