Breaking
Sat. Jun 28th, 2025

అప్పుల్లో ఆంధ్ర‌ గ‌ట్టెక్కేది ఎట్లా ?

  • ‘కాగ్’ నివేదికతో కంగుతింటున్న ఏపీ ప్ర‌జ‌లు
  • సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో చూపుతున్న శ్ర‌ద్ధ‌, ఖ‌జానాను పెంచుకోవ‌డంలో చూప‌డంలేదంటున్న ప్ర‌తిప‌క్ష నేత‌లు‌

సంక్షేమ ప‌థ‌కాల‌కు పెట్టింది పేరు ఆంధ్రప్ర‌దేశ్. దేశంలో ఏ రాష్ట్ర ప‌భుత్వం కూడా ఇంత త‌క్కువ కాలంలో ఇన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకురాలేద‌నే చెప్పాలి. అయితే “సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్నాం..” అని చెప్పుకునే ముందు “ఆ డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయి” అనేది కూడా ఆలోచించాల్సిన విష‌యం. ఏదేమైనా సరే.. మ‌నం ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల్లో పేరు తెచ్చుకుంటేనే మంచిద‌నుకుంటే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది.

సేమ్ అలాగే ఇప్పుడు ఆంధ్ర ప‌రిస్థితి త‌యార‌య్యింద‌ని ప‌లువురు అంటున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు ఉండొద్ద‌ని కాదు. అవి ఉంటే బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలకు కొంత‌ మంచి మాత్రం త‌ప్ప‌క‌ జ‌రుగుతుంది. కానీ అది ఎంత వ‌ర‌కు అనేది ఇప్పుడున్న ప్ర‌శ్న‌. మ‌న సంపాద‌‌న ఎంత ? దాన్ని ఎలా ఖ‌ర్చు చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి క‌దా! అందులో లోపం ఏర్పాడితే.. రాష్ట్ర ప‌రిస్థితి ఇంకోలా మారిపోతుంది.

ఇప్పుడు ఆంధ్ర ప‌రిస్థితి అలాగే ఉంద‌ని అనిపిస్తుంది. తాజా‌గా “కాగ్” విడుద‌ల చేసిన లెక్క‌లు చూస్తే.. మ‌తి పోవ‌డం కాయం. దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌లేనంత అప్పును ఆంధ్ర ప్ర‌భుత్వం చేసింది. అది అంతా ఇంతా కాదు.. ఒక ప‌ది చిన్న రాష్ట్రాలు చేసే అప్పుకు స‌మాన‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అప్పు సంగ‌తి అటు ఉంచితే.. ఆదాయం ఏమైనా వ‌స్తుందా ? అంటే అది లేదు. ఈ విష‌యాలు ఇప్పుడు అంద‌రిని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.

ఆంధ్ర చేసిన అప్పు ఎంత‌?

తాజాగా కాగ్ 2020 ఏప్రిల్ నుంచి 2021, జ‌న‌వ‌రి వ‌ర‌కు సంబంధించిన నివేదిక‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం ఆంధ్ర ఈ 10 నెల‌ల స‌మ‌యంలో ఏకంగా రూ.73 వేల 912 కోట్లు అప్పు చేసింది. దీంతో అత్య‌ధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా రికార్డు సాధించింది. ఆంధ్ర కంటే ఎక్కువ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్న రాష్ట్రాలు కూడా ఈ రేంజ్ లో అప్పులు చేసిన దాఖ‌లాలు లేవు. అయితే ఈ అప్పు స‌రిపోదంటూ ఆంధ్ర ప్ర‌భుత్వం ఆర్‌బీఐ నుంచి చేబ‌దుళ్ల కింద దాదాపుగా రూ.5 వేల కోట్ల‌ను అప్పుగా తీసుకుంది.

cag-report-on-andhrapradesh1 అప్పుల్లో ఆంధ్ర‌ గ‌ట్టెక్కేది ఎట్లా ?

కాగ్ ఏం చెబుతోంది?

కాగ్ విడుద‌ల చేసిన నివేదికలో ప‌లు విష‌యాల‌ను ప్ర‌స్థావించింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అప్పు రూ.28,653 కోట్ల అప్పును చేసింది. మ‌హారాష్ట్ర రూ.31,670 కోట్ల అప్పు చేసింది. త‌మిళ‌నాడు రూ.49,844 కోట్ల అప్పు చేసింది. క‌ర్నాట‌క రూ.30,229 కోట్ల అప్పు చేసింది. ఇక‌ తెలంగాణ రూ.43,937.95 కోట్ల అప్పు చేసింది. పంజాబ్ మాత్రం కేవ‌లం రూ.9,928 కోట్ల అప్పు చేసింది.

తెలంగాణ‌లో సంవ‌త్స‌రానికి ప్ర‌తీ ఎక‌రాకు రూ.10 వేల‌ను అందిస్తుంది. అది కూడా ఎంత భూమి ఉన్నా ఇస్తుంది. అలాంటిది దాని కంటే ఎక్కువ అప్పు ఆంధ్ర ప్ర‌భుత్వం చేసింది.

ఆంధ్ర గురించి కాగ్ చెప్పిన విష‌యాలు

నెల ఒక‌టో తేదీ రాగానే పింఛ‌న్ల పంపిణీకి ఎంతో ప్ర‌ధాన్యం ఇచ్చే ప్ర‌భుత్వం.. అదే ప్ర‌ధాన్య‌త ఆదాయ వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకోవ‌డంలో చూపించ‌లేద‌ని చెప్పాలి. అదే ఈ తీవ్రమైన అప్పుల‌కు సాక్ష్యంగా చెప్పొచ్చు.

రాష్ట్రానికి ఆదాయం వ‌చ్చే మార్గాలు

జీఎస్టీ, వ‌స్తు సేవ‌ల అమ్మ‌కాలతో 56.82 శాతం ఆదాయాన్ని మాత్ర‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం సాధించ‌గ‌లిగింది. ఇక మిగిలిన దాన్ని రెండు నెల‌ల స‌మ‌యంలో ఎలా సాధిస్తుంద‌నేది ఇబ్బందుల‌కు గురిచేసే ప్ర‌శ్న‌. స్టాంప్స్‌, రిజిస్ట్రేష‌న్స్ (భూముల అమ్మ‌కం)తో 67.47 శాతం ఆదాయాన్ని సంపాధించ‌గ‌లిగింది. పెట్రోల్‌, డీజిల్ అమ్మ‌కాలతో 53.36 శాతం ఆదాయాన్ని మాత్ర‌మే సంపాధించింది. డీజీల్, పెట్రోల్ ధ‌ర‌లు ఆకాశాన్ని చూస్తున్న ఈ స‌మ‌యంలో కూడా ప్ర‌భుత్వం ఆదాయాన్ని పెంచుకోలేక‌పోయింది. మిగిలిన ఈ రెండు నెల‌ల్లో ఆయా వాటిల్లో లోటుగా ఉన్న మొత్తాన్ని ఎలా సాధిస్తుందో వేచి చూడాలి.

ఆంధ్రను ఆదుకుంటుంది మ‌ద్య‌‌మే?

ఇది కొంత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌యం. మ‌ద్యపానాన్ని పూర్తిగ నిషేదిద్దాం అనుకున్న ప్ర‌భుత్వానికి ఖ‌జ‌నా ఇప్పుడు అక్క‌డి నుంచే వ‌స్తుంది. ఇది ఇప్పుడు అనుకున్న టార్గెట్‌కు మించి ముందుకు దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 14 శాతం ఆదాయాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్య‌పానం నుంచి అర్జించింది. మ‌రో రెండు నెల‌ల్లో మ‌రింత ఆదాయం లిక్కర్ ‌నుంచి వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ప్ర‌జ‌ల‌కు ఉండే మ‌ద్యం వ్య‌స‌నం ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఆదాయ వ‌నురు అయ్యింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కేంద్రం నుంచి రావాల్సిన సొమ్ము స‌రిగ్గా వ‌స్తుందా?

కేంద్రం నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌న్నుల వాట కిందా కొంత సొమ్మును తీసుకుంటాయి. అది ఆ ప్ర‌భుత్వాల‌ హ‌క్కు కూడా.. కానీ కాగ్ నివేదిక చూస్తే ప‌లు ఆశ్చ‌ర్య‌పోయే అంశాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 10 నెల‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌కు కేంద్ర నుంచి రూ.22,506 కోట్లు రావాలి. కానీ ఇంత వ‌ర‌కూ కేంద్రం నుంచి ఆంధ్ర‌కు అందిన మొత్తం రూ.11,313.96 కోట్లు మాత్ర‌మే.

ఇంకా రావాల్సిన మొత్తం రూ.11,192.04 కోట్లు. కేంద్రాన్ని ప్ర‌శ్నించి, నిల‌దీసీ తీసుకోవాల్సిన మొత్తాన్ని ఆంధ్ర ప్ర‌భుత్వం తీసుకోలేక‌పోతుంది. దీంతో కేంద్రం అంటే భ‌య‌మా లేక ఏంటి అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. అలాగే ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రం ఎంతో‌ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుంది అనేదానికి ఇదే నిద‌ర్శ‌ణం అని ప‌లువురు అంటున్నారు.

వీటివ‌ల‌న ఆంధ్ర‌కు న‌ష్ట‌మేనా?

మాములుగా 5శాతం ద్ర‌వ్య‌లోటు దాట‌కూడ‌ద‌ని ఆర్థిక నిపుణులు హెచ్చ‌రిస్తుంటారు. అలా జ‌రిగితే మంచిది కాద‌ని చెబుతుంటారు. కానీ దేశ చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో 35 శాతం ద్ర‌వ్య‌లోటు ఏర్ప‌డింది అంటే న‌మ్ముతారా? దీంతో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దివాళా తీసే అవ‌కాశం ఉంద‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

నేత‌లు ఏమంటున్నారు?

దీనిపై ఏపీ పీసీసీ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డి స్పందించారు. ఆంధ్ర మాదిరిగానే ప‌లు రాష్ట్రాలు కూడా సంక్షేమ ప‌థకాలు అందిస్తున్నాయిని తెలిపారు. కానీ ఆదాయ వ‌న‌రుల విష‌యంలో ఎవ‌రు ఇలా లేర‌ని తెలిపారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆదాయ వ‌నరుల స‌మీక‌ర‌ణ‌లో విఫ‌లం చెందింద‌ని తెలిపారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు మీద ఉన్న శ్రద్ధ, ఆదాయాన్ని పెంచ‌డంలో కూడా ఉండాల‌ని పేర్కొన్నాడు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మేల్కొని ఆర్థిక సంక్షోభం రాకుండా చూడాల‌ని తెలిపారు.

ప్రతి నలుగురిలో ఒకరికి చెవుడు !

వంటింట్లో సెగ పుట్టిస్తున్న వంట‌గ్యాస్ !

మైనర్ పై లైంగికదాడి కేసు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు !

అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?

మీ అభిప్రాయాల‌ను ప్ర‌పంచంతో పంచుకోవాల‌నుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. న‌లుగురిని ఆలోచింప‌జేసే ఏ ఆర్టిక‌ల్ ను అయినా మా వెబ్సైట్ లో ప‌బ్లిష్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేయాల్సిందల్లా మీ ఆర్టిక‌ల్స్ ను darvaaja@gmail.com కు మీ ఫొటో వివరాలతో పాటుగా మెయిల్ చేయడమే..

Related Post