Breaking
Tue. Nov 18th, 2025

సౌదీలో బస్సు ప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన 45 మంది దుర్మరణం.. ఒకే కుటుంబం 18 మంది

Saudi Arabia bus tragedy claims 45 Hyderabad pilgrims including 18 from one family
Saudi Arabia bus tragedy claims 45 Hyderabad pilgrims including 18 from one family

Saudi Bus Tragedy : సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్‌ను శోకసంద్రంలో ముంచేసింది. మక్కా నుంచి మదీనా ప్రయాణిస్తున్న యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో 45 మంది సజీవ దహనమయ్యారు. మరణించిన వారందరూ హైదరాబాద్‌కు చెందినవారేనని తెలంగాణ హజ్ కమిటీ ధృవీకరించడంతో నగరవ్యాప్తంగా దిగ్భ్రాంతి అలుముకుంది. మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ సహా పలు ప్రాంతాల వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదం ఎలా జరిగింది? మక్కా నుంచి మదీనా మార్గంలో విషాదం

అధికారుల వివరాల ప్రకారం, మొత్తం 54 మంది బృందం నవంబరు 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లింది. వీరిలో కొందరు వేరే వాహనాల్లో ప్రయాణించగా, 46 మంది మక్కా నుండి మదీనా చేరేందుకు బస్సులో బయల్దేరారు.
మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఫ్రిహాత్ ప్రాంతంలో బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. బస్సులో ఉన్న 45మంది అక్కడికక్కడే దహనమై మరణించారు.

ఈ ప్రమాదం నుంచి ఒకే వ్యక్తి అబ్దుల్ షోయబ్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ప్రమాదం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది.

మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు : హజ్ కమిటీ

తెలంగాణ హజ్ కమిటీ ఈ సంఘటనపై ముఖ్య ప్రకటన విడుదల చేసింది. వారు వెల్లడించిన వివరాల ప్రకారం :

  • మొత్తం 45 మంది మృతి
  • 17 మంది పురుషులు
  • 28 మంది మహిళలు
  • అందరూ హైదరాబాద్ నివాసితులే

జెడ్డాలోని భారత ఎంబసీ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి అక్కడి అధికారులతో కలిసి చర్యలు తీసుకుంది.

ఒకే కుటుంబం 18 మంది దుర్మరణం – నల్లకుంటలో తీవ్ర విషాదం

ఈ ప్రమాదంలో అత్యంత హృదయ విదారక అంశం నల్లకుంటకు చెందిన నసీరుద్దీన్ (65) కుటుంబం పూర్తిగా బలైపోవడం.
తన భార్య, కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లు ఇలా మొత్తం 18 మంది ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో 10 మంది చిన్నారులున్నారని బంధువులు తెలిపారు.

టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంఐఎం ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ నల్లకుంటలోని నసీరుద్దీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఒక కుటుంబం మొత్తం 18 మంది కోల్పోవడం సామాజిక వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

సౌదీలో మరణించిన హైదరాబాదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం సహాయం ప్రకటించింది..

  • ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
  • మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బృందం సౌదీకి రవాణా
  • మృతుల మత సంప్రదాయం ప్రకారం స్థానికంగానే అంత్యక్రియలు
  • ఒక్కో కుటుంబానికి ఇద్దరు బంధువుల ప్రయాణ ఏర్పాట్లు

అదే విధంగా, బీఆర్‌ఎస్ నేతల ప్రత్యేక ప్రతినిధి బృందం కూడా సౌదీకి వెళ్లనుంది.

దేశ నాయకుల సంతాపం

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ గాఢ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాయబార సంస్థలు బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తున్నాయన్నారు.
విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ ప్రమాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టాలని ప్రమాదం తర్వాత ఎంబసీ, కాన్సులేట్‌లకు ఆదేశించారు.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా రియాద్ ఎంబసీతో మాట్లాడి వివరాలు సేకరించినట్లు వెల్లడించారు.

ఈ ఘోర ప్రమాదం యాత్రికుల కుటుంబాలను మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణను శోకంలో ముంచేసింది.
హైదరాబాదీలందరినీ కలతపరిచిన ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Related Post