- బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఏమైంది
దర్వాజ- కొత్తూర్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే కులగణన చేసి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఏమైందని బీసీ నేతలు ప్రశ్నించారు. సోమవారం మండల బీజేపీ ఓబీసీ మోర్చా ఆద్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద బీసీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేసి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుండి 42 శాతానికి పెంచుతామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు ఇచ్చిన హామీలన్నీటికి వారం రోజుల్లో చర్యలు ప్రారంభించకపోతే లక్షల మంది బీసీలతో అన్ని కలెక్టరేట్లలో ధర్నాలు నిరసనలు దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కార్యలయంలో వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు మోహన్ సింగ్, కొత్తూరు మండల బీజేపీ అధ్యక్షులు మంగలి రమేష్, బిజెపి సీనియర్ నాయకులు దాసరి గణేష్, బీజేవైఎం కొత్తూరు మండల ప్రెసిడెంట్ అంబటి శ్రీశైలం, బీజేవైఎం నాయకులు రణధీర్, మున్సిపాలిటీ నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.