నంగునూర్ మండల కేంద్రంలో “ఉచిత కంప్యూటర్ శిక్షణ” ప్రారంభం
సిద్దిపేట: నంగునూర్ మండల కేంద్రంలో కేఆర్ఆర్ ఫౌండేషన్ (KRR Foundation) ద్వారా అందించనున్న “ఉచిత కంప్యూటర్ శిక్షణ” కార్యక్రమాన్ని గురువారం ఆ ఫౌండేషన్ చైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు (Kalvakuntla Vamsidhar Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురి విద్యార్థులకు అడ్మిషన్లు అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వంశీధర్ రావు మాట్లాడుతూ.. గత కొన్నియేండ్లుగా తాము కేఆర్ఆర్ ఫౌండేషన్ పేరిట పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామనీ, ఆ కార్యక్రమాలను విస్తరించే భాగంగా నిరుపేద యువతకు ఉద్యోగాలు పొందడానికి అవసరమైన శిక్షణను అందించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఈ క్రమంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే నంగునూర్ మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ సెంటర్ ను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఈ సెంటర్ లో రోజుకు రెండు బ్యాచ్ లకు శిక్షణ అందించడానికి సిద్దంగా ఉన్నామని, ఒక వేళ విద్యార్థుల సంఖ్య పెరిగితే.. బ్యాచుల సంఖ్యను కూడా పెంచుతామని తెలిపారు.
ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం కేవలం నెలకో.. రెండు నెలలకో పరిమితం కాదనీ, నిరంతరంగా కొనసాగుతుందని వివరించారు. ఎంతమంది వస్తే.. అంతమందికి ఉచితంగా శిక్షణ అందిస్తామని, అవసరమైతే సెంటర్ల సంఖ్యను కూడా పెంచుతామని ప్రకటించారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇటీవల సిద్దిపేట పట్టణ కేంద్రంలో ప్రారంభించిన “ఉచిత కంప్యూటర్ శిక్షణ”కు యువత నుంచి మంచి ఆదరణ వస్తుందనీ, కేవలం 50 మందితో ప్రారంభమైన కార్యక్రమంలో నేడు 500పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు.

అలాగే.. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమానికి కూడా మంచి ఆదరణ వస్తుందనీ, ప్రస్తుతం సిద్దిపేట పట్టణ కేంద్రంలో 8 సెంటర్లలో.. అలాగే, నంగునూర్, చిన్నకోడూర్, పెద్దకోడూర్, రాఘవపూర్, లక్ష్మి దేవ్ పల్లి గ్రామాల్లో అంబలి పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని తెలిపారు. గత నెల రోజులుగా మొత్తం 13 కేంద్రాల్లో ప్రతి రోజు దాదాపు 13వేల మందికిపైగా అంబలిని సేవిస్తున్నారని తెలిపారు.
రానున్న రోజుల్లో తమ సేవ కార్యక్రమాలను మరింత విస్తరిస్తామనీ, త్వరలో సిద్దిపేట పట్టణ కేంద్రంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నామని, అలాగే, నంగునూర్ మండల కేంద్రంలో మరొక సేవ కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
నంగునూర్ మండల కేంద్రంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి సహకరించిన స్థానిక నేతలకు, కేఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులకు, వేదాస్ సొల్యూషన్స్ సభ్యులకు ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పప్పురాజు, సురేందర్, ఎజాస్, పాషా, వెంకట్, రాజిరెడ్డి, ప్రభాకర్ గౌడ్, యాదిరెడ్డి, రాహుల్, భాస్కర్, జగదీష్, వెంకటేష్, రాజేష్, అఖిల్, సురేష్, రంజిత్, కిరణ్, గిరి, చిరు, సురేష్, అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు.