తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నూతన ప్లవనామ సంవత్సరాదిని పురష్కరించుకుని నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని శిరసనగండ్ల శ్రీ సీతారామ దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఆలయ పూజారులు పంచాగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు.
అపర భద్రాద్రి
శ్రీ సీతారాములు కోలువుదీరిన ఈ దేవాలయం అపర భద్రాద్రిగా పేరుగాంచింది. ఈ క్షేత్రంలో సీతారాముల దేవాలయంతో పాటు నవగ్రహాలు, రామలింగేశ్వరాలయం, శ్రీ హనుమన్ ఆలయం, ముక్కిడి మైసమ్మ, దత్తత్రేయ సన్నిధి, నాగసన్నిధి, రామకోటి స్థూపం, గణపతి దేవుడు, అంబికా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ క్షేత్రం కొండల నడుమ పెద్ద గుట్టపై ఉండటంతో ఇక్కడ జరిగే జాతరను చుట్టుపక్కల ప్రాంతాల వారు గట్టు జాతరగా కూడా పిలుస్తారు.

బ్రహ్మోత్సవాలపై కరోనా ప్రభావం
కాగా, ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సీతారాముల బ్రహ్మోత్సవాలపై కరోనా ప్రభావం పడింది. కరోనా కారణంగా గతేడాది భక్తులు లేకుండానే ఆలయ పూజారులు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఈ ఏడు జరిగే బ్రహ్మోత్సవాలు, ఇతర క్రతువులు సైతం భక్తుల లేకుండానే ఆలయ పూజారులే నిర్వహించనున్నారు.

శిరసనగండ్ల సర్పంచ్ శారద శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి అధికం కావడం.. ప్రజల సంక్షేమం, ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ సారి భక్తులు లేకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు. ప్రజల సంరక్షణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనా అధికమవుతున్న క్రమంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
దీనిపై ఆలయ చైర్మన్ డి.రామశర్మ మాట్లాడుతూ.. ఏడువందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సీతారాముల దేవాలయంలో కరోనా కారణంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పూజారుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు. దీనికి భక్తులు సహకరించాలని ఆయన కోరారు. కరోనా నిబంధనలకు లోబడి ఈ సారి బ్రహోత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి తెలిపారు.

అలాగే, ఆలయ పూజారి మురళిధర శర్మ మాట్లాడుతూ.. ఈ నెల 13 నుంచి ఈ నెల 21 వరకు ఈ సారి భక్తులను అనుమతించకుండా బ్రహోత్సవాలు జరుగుతాయనీ, ఈ నెల 20న మాస కళ్యాణం, 21న సీతారామ కళ్యాణం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉగాది పంచాగ శ్రవణ కార్యక్రమంలో శిరసనగండ్ల సర్పంచ్ శారద శ్రీనివాస్, ఆలయ చైర్మన్ డి.రామశర్మ, ఈవో శ్రీనివాస రెడ్డి, ఎం.నిరంజన్, పూజారులు డి.మురళిధర్ శర్మ, డి.లక్ష్మణ శర్మ, కోదండరామ శర్మ, ఆనంద్ శర్మ, డి.సీతారామ శర్మ, భక్తులు సహా పలువురు పాల్గొన్నారు.