దర్వాజ – నంగునూర్: నంగునూర్ మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ శాంతినికేతన్ లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రైమరీ విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణ వేసి చేసిన అల్లరి చేష్టలు ఎంతగానో అలరించాయి. అనంతరం విద్యార్థులతో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే విద్యార్థులతో మ్యూజికల్ చైర్స్ వంటి ఆటలను ఆడించారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మోర అంజయ్య మాట్లాడుతూ.. చిన్నారులతో ఇటువంటి కార్యక్రమాలు చేయించడం ద్వారా వారిలో మతసామరస్యాన్ని పెంపొందింపవచ్చునని అన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించినట్లు కరస్పాండెంట్ లావణ్య తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మోర అంజయ్య, కరస్పాండెంట్ లావణ్య, ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

