తలకొండపల్లి పట్టభద్రుల్లో ఎందుకింత నిర్లక్ష్యం !
ఓటు హక్కు వినియోగించుకోని 24 శాతం మంది తలకొండపల్లి పట్టభద్రులు
దర్వాజ-రంగారెడ్డి
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 50 శాతంలోపు పోలింగ్ నమోదైంది. అయితే, పూర్తి పోలింగ్ పూర్తయ్యే సరికి 76.72 శాతం ఓటింగ్ నమోదైంది. 23.28 శాతం మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. తలకొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 1405 మంది ఉండగా వారిలో 1078 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో మహిళలు 254 మంది, పురుషులు 824 మంది ఉన్నారు. పీఎస్ నెంబర్ 241లో మొత్తం 557 మంది ఓటును వినియోగించుకున్నారు. ఇందులో మహిళలు 142, పురుషులు 415 మంది ఉన్నారు. పీఎస్ నెంబర్ 242లో మొత్తం 521 పట్టభద్రులు ఓటును వినియోగించుకోగా.. ఇందులో మహిళలు 112, పురుషులు 409 మంది ఉన్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానాలకు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. పలు చోట్ల ఓటు వేసే సమయం ముగిసినప్పటికీ లైన్ లో ఉన్నవారికి 4 గంటల తర్వాత కూడా అధికారులు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానంలో మధ్యాహ్నం 2 గంటల వరకు 39.09 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు 43.46 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటుకు నోటు తప్పక తీసుకోవాల్సిందే..!
Share this content: