దర్వాజ-భోపాల్
13 dead as roof of well in Indore temple caves in: శ్రీరామ నవమి రోజున ఒక ఆలయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆలయంలోని బావిలో పడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మంది గాయపడ్డారు. పలువురు కనిపించడం లేదు. అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఉన్న ఒక ఆలయంలో మెట్లబావిలో దాదాపు 30 మంది పడిపోయారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం ఉన్న బావి పైకప్పు కూలిపోయింది. ఈ క్రమంలోనే వారు బావిలో పడిపోయారు. పటేల్ నగర్ లో ఉన్న బీలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా 17 మందిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
శ్రీరామనవమి సందర్భంగా భక్తుల రద్దీ మధ్య బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఈ ఘటన జరిగింది. భారీ జనసందోహం కారణంగా ఆలయం నేల కూలడంతో ప్రజలు బావిలోకి జారిపడినట్లు అక్కడి దృశ్యాలు సూచిస్తున్నాయి. తాళ్లు, నిచ్చెనలతో భక్తులను బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపించాయి.
బావిలో పడిన వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇది దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మధ్యప్రదేశ్ సీఎం ఆడిగి ఈ విషాదం గురించి అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.