దర్వాజ-హైదరాబాద్
Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు తీసుకోగా, కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. భారత్ లోనూ తీవ్ర ప్రభావం చూపింది. COVID-19 వ్యాప్తి కారణంగా పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఏకంగా 21.5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మొదలైన కోవిడ్-19 ఫస్ట్ వేవ్ నుంచి థర్డ్ వేవ్ ప్రభావం కారణంగా టూరిజం సెక్టార్ లో దాదాపు 21.5 మిలియన్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు.
COVID-19 వ్యాప్తి ప్రారంభమైన మొదటి వేవ్ సమయంలో దేశంలో పర్యాటకుల రాక 93 శాతం తగ్గిపోయిందనీ, అదే సెకండ్ వేవ్ లో 79 శాతం, థర్డ్ వేవ్ లో 64 శాతం తగ్గిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. “పర్యాటకంపై మహమ్మారి ప్రభావంపై మేము ఒక అధ్యయనం చేసాము. అధ్యయనం ప్రకారం, మొదటి వేవ్లో 14.5 మిలియన్ల ఉద్యోగాలు ఊడగా, రెండవ వేవ్లో 5.2 మిలియన్లు, థర్డ్ వేవ్ లో 1.8 మిలియన్ల ఉద్యోగాలు ఊడాయి” అని లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కిషన్ రెడ్డి వెల్లడించారు.
భారత్లోకి కరోనా వైరస్ ప్రవేశించకముందు 38 మిలియన్ల మంది పర్యాటక పరిశ్రమతో సంబంధం కలిగి ఉన్నారని మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని ఆయన వెల్లడించారు. కష్టాల్లో ఉన్న టూరిజం సెక్టార్ కు సహాయం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.