దర్వాజ-హైదరాబాద్
Agnipath protest: అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిరసనల హోరుతో అట్టుడికింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొనసాగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక ఆర్మీ అభ్యర్థి ప్రాణాలు కోల్పోయాడు. మరింత మంది గాయపడ్డారు. ఇప్పటికీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.
ఊహించని విధంగా నిరసనలు హింసాత్మకం..!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వచ్చిన విజువల్స్ ఎవరి ఊహకు అందనివిగా ఉన్నాయి. కాలిపోయిన వాహనాలు రైల్వే ట్రాక్లపై కనిపించాయి. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా గర్జించారు. కేంద్రం ఈ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య రైల్వే స్టేషన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకానొక సమయంలో, ఆందోళనకారులు రాళ్లు రువ్వడం ప్రారంభించారు.
పోలీసులే ముందుగా దాడి చేశారు..!
పోలీసులు మోహరించి.. భారీ కాల్పులకు ప్రతిస్పందనగా రాళ్లు రువ్వినట్లు నిరసనకారులు పేర్కొంటున్నారు. ”అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు అయితే, నిరసనకారులపై కాల్పులు ఇప్పటివరకు ఒక్క తెలంగాణలోనే జరిగింది. ఒక వ్యక్తి చనిపోయాడు. దానికి బాధ్యులెవరు?” అని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలోనే పోలీసులు తమపై దాడి చేశారని తెలిపారు. పరిస్థితి అదపులోకి తీసుకురావడానికే చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
రాజకీయాల్లేవ్.. !
ఈ నిరసనలపై రాజకీయ ఆరోపణల నేపథ్యంలో.. “మాకు TRS, కాంగ్రెస్ లేదా మరే ఇతర పార్టీకి వ్యతిరేకంగా ఏమీ లేదు. స్కీమ్ తీసుకొచ్చినందున భాజపా మాత్రమే బాధ్యత వహించాలి. బండి సంజయ్ (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు) టీఆర్ఎస్, కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు కానీ ఈ అంశంపై మాట్లాడలేదు. ఇప్పుడు కూడా వారు రాజకీయం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిరసనకారులందరూ ఒక్కసారిగా బీజేపీ ఖబర్దార్ అంటూ అరిచారు.
కాల్పులు ఆదేశాలు ఎవరిచ్చారు?
నిరసనల నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల కారణంగా ఒకరు చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులపై కాల్పులకు ఎవరు ఆదేశాలు జారీ చేశారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు దేనికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఎప్పటిలాగే ఆర్మీ ర్యాలీ నిర్వహించాలి.. !
నిరసనకారులకు ప్రధాన ఆందోళన ఏమిటంటే, సర్వీస్ కేవలం నాలుగు సంవత్సరాలు (పరిమిత ఉపాధి) మాత్రమే. ఇంకా, దీని తర్వాత చాలా మందికి గ్రాట్యుటీ మరియు పెన్షన్ ప్రయోజనాలు లేకుండా నిర్బంధ పదవీ విరమణ ఉంటుంది. ఆర్మీ ర్యాలీని ఎప్పటిలాగే నిర్వహించాలని, అగ్నిపథ్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.