దర్వాజ-న్యూఢిల్లీ
Agnipath protest: నాలుగు సంవత్సరాల పాటు సైనికులను రిక్రూట్మెంట్ చేసి, 25 శాతం మందిని మాత్రమే పర్మినెంట్ సర్వీస్లో ఉంచి, మిగిలిన వారిని వదిలిపెట్టే అగ్నిపథ్ స్కీమ్ పై యువత నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేక వ్యక్తమవుతున్నది. భారీ ఆందోళనలు కొనసాగుతున్న పరిస్థితుల మధ్య అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఆర్మీలో చేరిన సైనికులకు కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నాయి. అనేక మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్నివీరులను ఆర్మీ సేవల నుంచి విడుదల చేసిన తర్వాత వారి సేవలను ఉపయోగించుకుంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని 10 శాతం రిజర్వేషన్లను అగ్నివీరులకు కేటాయించనున్నట్లు తెలిపారు.
“ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు డిఫెన్స్ సివిలియన్ పోస్టులు మరియు మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్లలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుత రిజర్వేషన్కి అదనంగా ఉంటుంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిందిన. అలాగే, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్లో అగ్నివీరులకు 10 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గరిష్ట వయో పరిమితి సైతం మూడేండ్లు పెంచింది.
కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రోత్సాహకాలు
కేంద్ర క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. తమ మంత్రిత్వ శాఖ అగ్నివీరులను క్రీడా రంగంలో శిక్షకులు లేదా పాఠశాలలు మరియు కళాశాలల్లో ఫిజికల్ టీచర్ల ఉద్యోగాలను పొందేలా స్వల్పకాలిక కోర్సును తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎయిర్ ట్రాఫిక్ సేవలు, విమాన సాంకేతిక నిపుణులు, విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, వాతావరణం, విమాన ప్రమాద పరిశోధకుడి సేవలు, విమాన భద్రత, అడ్మినిస్ట్రేటివ్, IT, కమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్, సరఫరా గొలుసు నిర్వహణ వంటివి సేవల్లో అగ్నివీరులకు అవకాశం కల్పిస్తామని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.
అగ్నివీరుల కోసం కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ సైతం పలు విభాగాల్లో చేర్చుకుంటామని తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో అగ్నివీర్లకు వారి విద్యార్హతలు మరియు నైపుణ్యాల ఆధారంగా తగిన సామర్థ్యాలలో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
రాష్ట్రాలు అగ్నివీరులకు కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు..
రాష్ట్రంలో పోలీసు మరియు సంబంధిత సర్వీసుల రిక్రూట్మెంట్లో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అగ్నివీరులను ఉత్తరాఖండ్ పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు రాష్ట్రంలో చార్ ధామ్ నిర్వహణలో చేర్చనున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. స్థానిక అగ్నివీరులను రాష్ట్ర పోలీసు విభాగంలోకి తీసుకుంటామని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. హర్యానా, కర్నాటక సైతం పలు హామీలు ఇచ్చింది.
