దర్వాజ-విజయవాడ
AP Social Welfare Minister Merugu Nagarjuna: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాఖ మంత్రి మంత్రి మేరుగు నాగార్జున సీరియస్ కామెంట్స్ చేశారు. ”చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకుని చివరికి జైలు పాలయ్యాడు. ఎప్పుడో ఒకప్పుడు చేసిన పాపం పండకపోదు. చట్టానికి దొరికిన దొంగ చంద్రబాబు” అంటూ మంత్రి మేరుగు నాగార్జున వ్యాఖ్యలు చేశారు. మంత్రి మేరుగు నాగార్జున మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ”చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. చట్టాలు చంద్రబాబుకు చుట్టాలు కావు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు ఇంకా అనేక కేసుల్లో ఇరుక్కుంటారు. ప్రజల్లో చంద్రబాబుకు సానుభూతి లేదు. త్వరలో నారా లోకేశ్ కూడా ముద్దాయి కాబోతున్నాడు. ఇకనైనా చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని” అన్నారు.
లోకేశ్ బూతులు మాట్లాడటం మానుకో..
‘ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు బతికారు. ఎన్నో అక్రమాలు చేసిన చంద్రబాబు చివరికి దొరికిపోయారు. నారా లోకేశ్ ముందు బూతులు మాట్లాడటం మానుకో. మేము కూడా మీలాగ మాట్లాడితే తట్టుకోలేరు. పేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శకంగా సంక్షేమం అందిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేక పోయారు. అనేక కుట్రలు చేసి అడ్డుకోవాలని చూశారు. దత్తపుత్రుడిని వెంటేసుకుని సీఎం జగన్ మీద ఎన్నెన్ని ఆరోపణలు చేశారో జనం చూస్తూనే ఉన్నారని’ అన్నారు.
అన్నీ కేసుల్లో చంద్రబాబే ముద్దాయి..
‘సమర్ధవంతమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో ఉన్నారు. చంద్రబాబు మీద మాకు కక్షలేదు. అదే ఉంటే అధికారంలోకి వచ్చాకే ఆయన్ను అరెస్టు చేసేవాళ్లం. ఇప్పుడు అన్ని కేసుల్లోనూ ఆయనే ముద్దాయి. కచ్చితంగా కోర్టులో అన్ని కేసుల్లోనూ ముద్దాయిగా నిలబడక తప్పదు. పవన్ కళ్యాణ్ మొన్న చంద్రబాబును అరెస్టు చేయగానే హడావుడిగా వచ్చారు. అంతే హడావుడిగా వెళ్లిపోయారు. ఎందుకు వచ్చాడో, రోడ్డుమీద ఎందుకు పడుకున్నాడో ఆయనకే తెలియదన్నారు. రాష్ట్రంలో టీడీపీ బంద్కు ఎలాంటి స్పందన లేదని, జనం ఎవరూ బంద్ను పట్టించుకోలేదని’ అన్నారు.