దర్వాజ-న్యూఢిల్లీ
Arvind Kejriwal on tour in Gujarat: ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్, బీజేపీలపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పర్యటనలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీలు సంపన్నులకు కొమ్ముకాసే పార్టీలని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు సంపన్నులకు అండగా నిలుస్తూ రోజురోజుకూ సంపన్నులను మరింత సంపన్నులను చేస్తున్నాయన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్.. చదేలియాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ లోని బీజేపీ సర్కారుపై తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పించారు. 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి.. లక్షలాది మంది పిల్లల భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు. “మీరు మా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి.. మేము పాఠశాలను నిర్మిస్తాము. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం. ఈరోజు ఢిల్లీ రూపురేఖలను ఎలా మార్చామో.. గుజరత్ ను కూడా అలా తీర్చిదిద్దుతాము.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ఇక్కడ పరిస్థితులను మెరుగుపరుస్తాం” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. “ఈరోజు ఆరున్నర కోట్ల మందితో సంబంధాలు పెట్టుకోవడానికి వచ్చానని.. రాజకీయాలు చేయడం తెలియదు.. డర్టీ పాలిటిక్స్, దొంగతనం, అవినీతి అస్సలు తెలియదు” అని అరవింద్ కేజ్రీవాల్ పురుద్ఘాటించారు.
బీజేపీ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు కేజ్రీవాల్ సవాల్ విసిరారు. “గుజరాత్లో పరీక్షల సమయంలో పేపర్ లీక్లో బీజేపీ ప్రపంచ రికార్డు సృష్టిస్తోందని, పేపర్ లీక్ లేకుండా ఒక్క పరీక్ష నిర్వహించాలని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్కు నేను సవాల్ చేస్తున్నానని” ఆయన అన్నారు. కాగా, గుజరాత్ త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ లోనూ పాగా వేయాలని ఆప్ భావిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో దాదాపు 58 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆప్ తన అంతర్గత సర్వేలో తేలిందని గత నెలలో ఆప్ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల నుంచి, పట్టణ ప్రాంతాల్లోని దిగువ, మధ్యతరగతి వర్గాల నుంచి ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే సూచించింది.