దర్వాజ-న్యూఢిల్లీ
AAP MLA and Spokesperson Raghav Chadha: గుజరాత్లో బీజేపీ ఎప్పటికీ యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం పేర్కొంది. కాషాయ పార్టీ ఎన్నికల వాగ్దానాన్ని నకిలీ వాగ్దానాలుగా పేర్కొంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ స్పందించింది. అధికారం నిలుపుకుంటే రాష్ట్రంలో యూసీసీని అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
’27 ఏళ్లుగా గుజరాత్ను బీజేపీ పాలించింది. రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో కొనసాగిన తర్వాత, ఇప్పటికీ వాగ్దానాలు చేస్తూనే ఉంది” అని గుజరాత్లో ఆప్ కో-ఇంఛార్జి రాఘవ్ చద్దా అన్నారు. రాష్ట్రంలో యూసీసీని అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల వాగ్దానం గురించి మీడియా ప్రశ్నించగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. “ఇది నిజంగా వారి ఉద్దేశం అయితే, వారు దానిని (యూసీసీ) చాలా ముందుగానే అమలు చేసి ఉండేవారు” అని చద్దా అన్నారు. ఎందుకు ఇప్పటివరకు అమలు చేయలేదని ప్రశ్నించారు. “ఇది బూటకపు వాగ్దానం. బీజేపీ దీన్ని (యూసీసీ) ఎప్పటికీ అమలు చేయదు’ అని ఆయన అన్నారు.
అక్టోబరు 29న గుజరాత్ ప్రభుత్వం యూసీసీ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా యూసీసీని అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. గుజరాత్ ఎన్నికలకు ముందు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అసలు సమస్యలపై మాట్లాడటం లేదని చద్దా అన్నారు. గుజరాత్ ప్రజల ఆర్థిక పురోభివృద్ధికి నమూనాగా ముందుకు వచ్చిన ఏకైక పార్టీ ఆప్ మాత్రమేననీ, డిసెంబర్ 1, 5న రెండు దశల్లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.