దర్వాజ-న్యూఢిల్లీ
Coronavirus-WHO: కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉందనీ, అది ఎక్కడికి పోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు.. అప్రమత్తంగా ఉంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మంగళవారం నాడు ప్రపంచ దేశాలను హెచ్చరించారు. కోవిడ్ -19 కేసుల తాజా తరంగాలు మహమ్మారి ముగిసిపోలేదని విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్లను అందరికీ అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
COVID-19 కేసులు పెరుగుతూనే ఉండటం తమను ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు, మరణాలు ఆరోగ్య వ్యవస్థలు, ఆరోగ్య కార్యకర్తలపై మరింత ఒత్తిడి పెంచుతోందని అన్నారు. ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. కోత్త వైవిధ్యాలపై ఓ కన్నేసి ఉంచాలనీ, ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించాలని సూచించారు. COVID-19పై ఎమర్జెన్సీ కమిటీ గత వారం సమావేశమై వైరస్ అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మిగిలి ఉందని నిర్ధారించిందన్నారు. “BA.4, BA.5 వంటి Omicron ఉప-వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా కేసులు, ఆసుపత్రిలో చేరడం, మరణాల పెరుగుదలకు కారణం అవుతున్నాయి” అని WHO చీఫ్ చెప్పారు.