దర్వాజ-హైదరాబాద్
covid-19 update in india: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. భారతదేశంలో ఒకే రోజు 3,095 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే, కొత్తగా ఐదుగురు కరోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,15,786) కు చేరుకుంది. అలాగే, కోవిడ్-19 మరణాలు మొత్తం 5,30,867కు పెరిగాయి.
వరుసగా రెండో రోజు కూడా మూడు వేలకు పైగా కోవిడ్-19 కొత్త కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఆరు నెలల్లోనే ఒకే రోజు అత్యధిక కోవిడ్ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. తాజా కరోనా వైరస్ కేసుల పెరుగుదల కారణంగా క్రియాశీల కేసులు పైతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 15,208 క్రియాశీల కేసులు ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో గోవా, గుజరాత్ లలో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు కోవిడ్ తో పోరాడుతూ మరణించారు.
రోజువారీ పాజిటివిటీ 2.61 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ 1.91 శాతంగా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,15,786)గా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదులను ప్రజలకు అందించారు.
ఇదిలావుండగా, దేశ రాజధానిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. గురువారం భరద్వాజ్ ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారనీ, ఆ తర్వాత కేజ్రీవాల్ సమీక్ష నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.