దర్వాజ-సిద్దిపేట
Nangunoor: వ్యవసాయరంగం బలోపేతానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని నంగునూర్ మండల తెరాస నాయకులు అన్నారు. సిద్ధిపేట జిల్లా నంగునూర్ మండలంలోని మైసంపల్లి గ్రామంలో 19 మంది రైతులకు శనివారం నాడు స్పింక్లర్ సెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంగునూర్ పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. రైతు శ్రేయస్సును కోరే ఏకైక ప్రభుత్వం.. తెరాస ప్రభుత్వమనీ, మన ముఖ్యమంత్రికి రైతులు, వ్యవసాయ సమస్యల పట్ల అవగాహన ఉందని, ఆయన కూడా ఓ రైతేనని అన్నారు. పంటల సాగులో సంప్రదాయం పద్దతులనే కాకుండా.. ఆధునిక పద్దతులను అనుసరించాలని సూచించారు. రైతులు సెరి కల్చర్, ఆయిల్ ఫామ్, వాణిజ్య పంటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. అధిక దిగుబడులను ఇచ్చే పంటల సాగుపై తెలంగాణ ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోందని, తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో వ్యవసాయరంగం ముఖ్యభూమిక పోషిస్తున్నదని అన్నారు.
మనది రైతు సంక్షేమ ప్రభుత్వమనీ, రైతులు, వ్యవసాయ సమస్యల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెరాస ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మన జిల్లాలో సాగు విస్తీర్ణం, పంటలు దిగుబడి గణనీయంగా పెరిగిందని అన్నారు. రైతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెరాస నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ నంగునూర్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, పిఎసిఎస్ పాలమాకుల చైర్మన్ యెల్లెంకి మహిపాల్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ గందమల్ల స్వరూప రాజెల్లయ్య, తెరాస నాయకులు బాలరత్నం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.