కోవిడ్ మార్గదర్శకాలను పాటించండి లేదా భారత్ జోడో యాత్రను వాయిదా వేయండి: కేంద్రం
దర్వాజ-న్యూఢిల్లీ
Congress Bharat Jodo Yatra: కరోనా మార్గదర్శకాలు పాటించండి లేదా భారత్ జోడో యాత్రను వాయిదా వేయండి అంటూ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది.
వివరాల్లోకెళ్తే.. కొన్ని దేశాల్లో కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను మార్గదర్శకాలను పాటించాలని పేర్కొన్నారు. లేదా దేశం, ప్రజల ప్రయోజనాల కోసం భారత్ జోడో యాత్రను వాయిదా వేయాలని అన్నారు. ఇదే విషయం గురించి ఆయన మంగళవారం రాహుల్ గాంధీ, గెహ్లాట్ లకు లేఖ రాశారు. యాత్ర సమయంలో మార్గదర్శకాలను పాటించకపోవడం వల్ల కోవిడ్ సంక్రమణ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజస్థాన్ కు చెందిన కొందరు ఎంపీలు రాసిన లేఖల తరువాత ఇది జరిగింది.
కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి.. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నొక్కి చెప్పారు. రాజస్థాన్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. మాస్కులు, శానిటైజర్లు వాడాలని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ఈ యాత్రలో పాల్గొనేలా చూడాలని సూచించారు. యాత్రలో చేరడానికి ముందు, తర్వాత ప్రయాణికులను ఐసోలేట్ చేయాలని రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్లకు రాసిన లేఖలో మాండవీయ పేర్కొన్నారు.
కోవిడ్ -19 ప్రోటోకాల్ పాటించడం సాధ్యం కాకపోతే, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని చూసి భారత్ జోడో యాత్రను వాయిదా వేయాలనీ, కోవిడ్ మహమ్మారి నుండి దేశాన్ని కాపాడాలని మాండవీయ ఇద్దరు నాయకులకు రాసిన లేఖలలో పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించడానికి ఆరోగ్య మంత్రి తన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత కోవిడ్-19 వ్యాప్తి పై కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.
Share this content: