పారిశుధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిన సర్కారు
దర్వాజ-హైదరాబాద్
Salary hike for sanitation workers: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నాడు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి వేతనాలు పెంచుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.1000 వేతన పెంపు రూపంలో ప్రత్యేక మేడే కానుకతో సహా కొత్త సచివాలయం తొలి పూర్తి పనిదినంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ వేతన పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు కూడా త్వరలో జీతాలు పెంచుతామనీ, ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి తగిన ప్రక్రియను పాటించాలని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కీలకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పురోగతిపై సమీక్షించిన ముఖ్యమంత్రి జీవో నంబర్లు 58, 59 ప్రకారం నోటరీ పత్రాలతో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. వేతనాల పెంపు విషయానికొస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని పారిశుధ్య కార్మికులకు ప్రస్తుత నెల జీతాలతో పాటు పెంపు ఉంటుంది.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడుతూ వారి సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొన్నేళ్లుగా పల్లెలు, పట్టణాల్లో జరిగిన అభివృద్ధి అమోఘం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థానిక సంస్థలకు లభించిన అవార్డులు వారి సేవలకు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. అభివృద్ధి పరంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల రూపురేఖలు చాలా మారిపోయాయి. రాష్ట్ర అభివృద్ధిలో నగరపాలక సంస్థల్లోని కార్మికుల పాత్రను కొనియాడుతూ, వారి అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి ఎప్పటికప్పుడు వారి జీతాల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
Share this content: