దర్వాజ-హైదరాబాద్
Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూలై 16 వరకు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు ప్రభుత్వం అంతకుముందు ఆదివారం నుంచి మూడు రోజుల సెలవు ప్రకటించింది. ఇంకా వానలు దంచికొడుతుండటంతో వాటిని పొడిగించింది. తెలంగాణలో గోదావరి ఎగువ బేసిన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లన్నీ నిండాయి. గోదావరి బేసిన్లో దాదాపుగా జలాశయాలన్ని నిండిపోయాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రాష్ట్రంలో వరదల పరిస్థితిని సమీక్షించి, నీటిని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు నీటిపారుదల శాఖ ఇప్పుడు నీటి మట్టాలను ఎలా పునరుద్ధరించాలనే దానిపై దృష్టి సారించి, రైతుల అవసరాన్ని బట్టి విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. తద్వారా వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు చేపట్టవచ్చని అధికారులు తెలిపారు.
నిజామాబాద్లోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు, పోచారం, ఆదిలాబాద్లోని స్వర్ణ, కడెం, పెద్దపల్లిలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతుల నీటి అవసరాలు తీరుతాయని అధికారులు నమ్మకంగా ఉన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిఘా పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంధన శాఖలను ఆదేశించారు.