Heavy rainfall: తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటికే అనేక ప్రాంతాలు నీటమునిగాయి. జీనజీవనం స్థంభించిపోయింది. మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా పయనిస్తోంది. రానున్న 24 గంటల్లో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్ గఢ్ మీదుగా పశ్చిమ దిశగా పయనించే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్ లో పేర్కొంది.