రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థుల మృతిపై ప్రత్యేక కమిటీ విచారణ
దర్వాజ-గువాహతి
Guwahati Road Accident : ఈశాన్య భారత రాష్ట్రమైన గువాహటిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అస్సాం ఇంజనీరింగ్ కాలేజీ (ఏఈసీ)కి చెందిన ఏడుగురు విద్యార్థులు మృతి చెందడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర విద్యాశాఖను ఆదేశించారు. దర్యాప్తు ముగిసి నివేదిక వచ్చే వరకు ఏడుగురు విద్యార్థులు బస చేసిన ఏఈసీ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్లను సెలవుపై పంపించారు.
అలాగే, యూనివర్శిటీ ఎన్నికల్లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను పరిగణనలోకి తీసుకున్న అస్సాం ముఖ్యమంత్రి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుత విద్యార్థి ఎన్నికల విధానాన్ని సమీక్షించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యా సంస్థల హాస్టళ్లలో క్రమశిక్షణ, నిబంధనల పట్ల గౌరవం పెంచేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. హాస్టల్ సమయ పరిమితులను కఠినంగా అమలు చేయడం, ఆవరణలో మద్యపాన నిషేధం తదితర అంశాలను కమిటీ పరిశీలిస్తుంది.
Share this content: