‘ధరణి’ భూ రికార్డుల పోర్టల్ను రద్దు చేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్
దర్వాజ-హైదరాబాద్
Dharani portal: టీఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడింది. భూ రికార్డులు ధరణి పోర్టల్ ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ‘ధరణి’ భూ రికార్డుల నిర్వహణ పోర్టల్ను రద్దు చేయాలనీ, భూ వివాదాలను పరిష్కరించాలనీ, అటవీ హక్కుల చట్టం ప్రకారం భూమిపై హక్కులు కల్పించాలని తెలంగాణ కాంగ్రెస్ సోమవారం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి, ఇతర పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
భూ రికార్డుల నిర్వహణ బాధ్యతను “ధరణి” పేరుతో విదేశీ కంపెనీకి అప్పగించడంపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. తెలంగాణ ఏర్పడే వరకు (నిజాం పాలన నుంచి) భూరికార్డుల నిర్వహణను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్ఎ) నిర్వహించారని గమనించిన కాంగ్రెస్ ‘ధరణి’ని రద్దు చేసి పాత పద్దతినే అనుసరించాలని డిమాండ్ చేసింది. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం “అందరికీ భూమి హక్కు కల్పించాలి” అని కాంగ్రెస్ మెమోరాండంలో పేర్కొంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పోడు రైతుల సమస్యలను అధికార టీఆర్ఎస్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను బ్యాంకులు డిఫాల్టర్లుగా ప్రకటిస్తున్నాయనీ, దీంతో వారు రుణాలు తీసుకోవడానికి అనర్హులుగా చేస్తున్నారని అన్నారు. ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసు’, ‘ఢిల్లీ మద్యం పాలసీ’ అంశంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ ఇరుకున పడడంతో అసలు సమస్యలు దారి మళ్లుతున్నాయని ఆరోపిస్తూ.. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళికతో పోరాడుతుందని అన్నారు.
Share this content: