హైదరాబాద్-దర్వాజ
క్రైమ్ న్యూస్: మద్యం మత్తులో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) విజయసింహ ఆదివారం రాత్రి బేగంపేటలోని బీఎస్ మక్తాలో ఉన్న ఓ వివాహిత ఇంటికి వెళ్లి ఆమెను తనతో రావాలని కోరాడు. అయితే, దానికి ఆమె నిరాకరించడంతో సింహా బీరు బాటిల్తో కొట్టి గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
మీడియా రిపోర్టుల ప్రకారం.. ఒక ఈవెంట్ కోసం పని చేస్తున్నప్పుడు బాధిత మహిళ ఎమ్మెల్యే పీఏ కంటపడింది. అప్పటి నుంచి సింహా ఆమెకు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తున్నాడు. ఆమె కాల్కు హాజరు కాకపోతే, చంపేస్తానని బెదిరించాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు పీఏగా ఉన్న సింహాపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఆమె భర్త ఆగ్రహం వ్యక్తం చేశారు. “నన్ను విడిచిపెట్టి అతనితో ఉండమని ఎమ్మెల్యే పీఏ నా భార్యను బెదిరించాడు” అతను ఆరోపించాడు. అలాగే, అతని కుటుంబానికి ఎమ్మెల్యే పీఏ నుండి ప్రాణహాని ఉందని చెప్పాడు.
కాగా, నిషా (35) అనే మహిళ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. 448, 324, 354(ఎ) 506 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరీశ్ చంద్రారెడ్డి తెలిపినట్టు ఇండియాటూడే నివేదించింది.