దర్వాజ-అంతర్జాతీయం
టమోటా ధరలు: ఇటీవల వరదల కారణంగా పాకిస్తాన్ లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఆ దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశవ్యాప్తంగా వరదలు భారీ పంట నష్టం కలిగించిన తరువాత, లాహోర్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయనీ, టమోటాలు ధరలు ఒక్క కిలోకు 500 రూపాయల వరకు పలుకుతున్నాయని అక్కడి మీడియా నివేదించింది. వరదల కారణంగా సరఫరా గొలుసుకు అంతరాయం కలగడంతో దుకాణదారులు ఇష్టానుసారంగా ధరలను పెంచారని సమా టీవీ నివేదించింది. ఉల్లి కిలో రూ.300, నిమ్మకాయ కిలో రూ.400 చొప్పున విక్రయిస్తున్నారని పేర్కొంది.
టమాటా ధర కిలోకు ప్రభుత్వ ధర రూ. 80 ఉండగా, ప్రస్తుత ధరలు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఉల్లి కిలో అధికారిక ధర రూ. 61 కంటే ఐదు రెట్లు ఎక్కువ అని సమా టీవీ నివేదించింది. అల్లం, వెల్లుల్లి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. “ఇప్పుడు పేదవాడు టమోటాలను మాత్రమే చూడగలడు.. వాటిని కొనలేడు.. తినలేడు” అని ఒక కొనుగోలుదారు చెప్పాడని సమా టీవీ నివేదించింది. ఎప్పుడూ కిలో 100 రూపాయలకు మించి విక్రయించని ఉల్లి ఇప్పుడు 250 లేదా 300 రూపాయలకు అమ్ముడవుతోంది.
ఇదిలావుండగా, ఆకస్మిక వరదలు, పొంగిపొర్లుతున్న నదులు పాకిస్తాన్ అంతటా విధ్వంసం సృష్టించడంతో.. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆ దేశం ఇప్పటికే $5.5 బిలియన్ల విలువైన నష్టాన్ని చవిచూసిందని సమా టీవీ నివేదించింది. సింధ్, పంజాబ్ ప్రావిన్స్లలో చెరకు-పత్తి పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఉల్లి, టమోటా, మిరప పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్క పత్తి పంట నష్టం 2.6 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది.
పాకిస్థాన్ టెక్స్టైల్, చక్కెర ఎగుమతులు 1 బిలియన్ డాలర్ల మేర తగ్గవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సింధ్లోని ప్రభుత్వ గోదాముల్లో కనీసం 2 మిలియన్ టన్నుల గోధుమలు వర్షాలు, వరదల కారణంగా పాడైపోయాయని, దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లిందని సమా టీవీ నివేదించింది. వ్యవసాయ రంగంలో విధ్వంసం అంటే పాకిస్తాన్ పరిశ్రమలకు సరఫరా కొరతను ఎదుర్కోవడమే కాకుండా దేశంలో విత్తన సంక్షోభం కూడా ఉండవచ్చునని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
