- భవిష్యత్తుపై వినియోగదారుల్లో ఆందోళన
- భారతీయ రిజర్వు బ్యాంకు తాజా నివేదిక
దర్వాజ-న్యూఢిల్లీ
కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక, ఆరోగ్య సంక్షోభం యావత్ ప్రపంచాన్ని కుదేలు చేస్తోంది. మరీ ముఖ్యంగా భారత్లో కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం మాములుగా లేదు. దేశంలో తగ్గినట్టే తగ్గిన మహమ్మారి ఇదివరకు లేని విధంగా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా భవిష్యత్తుపై విశ్వాసం కోల్పోయే స్థాయికి ప్రజలను తీసుకువచ్చిందంటే ఈ కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది. దేశ ప్రజలకు (వినియోగదారులకు) భవిష్యత్తుపై విశ్వాసం సన్నగిల్లిందని ఐర్బీఐ నివేదిక ద్వారా తెలుస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటం.. ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, ముఖ్యంగా దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం నెలకొని ఉన్న నేపథ్యంలో వినియోగదారులు నిరాశను వ్యక్తం చేశారని ఆర్బీఐ నివేదిక (కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే) పేర్కొంది.
దేశంలోని 13 నగరాల్లో 5,372 కుటుంబాలను భాగస్వాములను చేస్తూ ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 మధ్యకాలంలో ఆర్బీఐ సర్వే చేపట్టింది. ఆ నగరాల జాబితాలో అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, లక్నో, ముంబయి, పాట్నా, తిరువనంతపురంలు ఉన్నాయి. సర్వేలో భాగంగా ఉపాధి అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు, ధరల పరిస్థితులు, ఆదాయ వ్యయాల తీరు వంటి పలు అంశాలకు సంబంధించి ఆయా కుటుంబాలు వెలిబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను తయారుచేసింది.

ఈ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే ప్రకారం ప్రకారం.. భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, ధరలు, ఆరోగ్య సదుపాయాలు వంటి పలు ఆంశాలపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. మరీ ముఖ్యంగా వినియోగదారుల విశ్వాసం మార్చి నెలలో భారీగా బలహీన పడిందని ఈ నివేదిక సూచించింది. మార్చి నెలలో వినియోగదారుల విశ్వాస సూచీ 53.1 పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో ఇది 55.5 గా ఉంది.
అయితే, గతేడాది సెప్టెంబర్లో ఏకంగా 49.9 శాతానికి పడిపోయిన వినియోగదారుల విశ్వాస సూచీ క్రమంగా కోలుకుంది. మళ్లీ ఇలా కిందకు దిగజారింది. సాధారణంగా విశ్వాస సూచీ 100కు దిగువన ఉంటే నిరాశావాదంలో ఉన్నట్టుగా, 100కు పైన ఉంటే విశ్వాసంతో ఉన్నట్టుగా సూచిస్తుంది. వినియోగదారుల విశ్వాస సూచీకి తోడు భవిష్యత్తు అంచనాల సూచీ (ఎఫ్ ఈఐ) సైతం నిరాశవాదంలో ఉండటం గమనార్హం. జనవరిలో 117.1 గా ఉన్న ఎఫ్ ఈఐ మర్చి నెలలో 108.8కి పడిపోయింది.
ఐర్బీఐ రిపోర్టు మరిన్ని వివరాల ప్రకారం.. కుటుంబాలు అత్యవసర పరిస్థితులకు అత్యధిక వ్యయం చేయాల్సి వస్తోంది. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. భవిష్యత్తులో ఈ ఖర్చు మరింత పెరిగితే ఏర్పడే పరిస్థితులపై ఆందోళన వ్యక్తమైంది. ఆర్థిక వ్యవస్థలో పెద్ద మొత్తంలో ఖర్చు చేసే అవకాశం సైతం తక్కువగా ఉంటుందని నివేదిక పేర్కొంది. మరీ ముఖ్యంగా ద్రవ్యోల్బణ అంచనాలను సూచించింది.
ఒక్కరోజే 1.26 లక్షల మందికి కరోనా
లింగ సమానత్వం ఇప్పట్లో జరగనట్టే !