దర్వాజ-హైదరాబాద్
Intermediate examinations: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. శుక్రవారం నాడు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కాగా, శనివారం నుంచి రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు షురూ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో మొత్తం 1443 పరీక్షా కేంద్రాల్లో 9.07 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా ఇంటర్ పరీక్షా కేంద్రంలోకి విద్యార్ధులను అనుమతించబోమని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు.
అలాగే, మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ , సెకండియర్ కలిపి 9,14, 423 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
