దర్వాజ-న్యూఢిల్లీ
పడవ బోల్తా పడి 26 మంది జలసమాధి అయ్యారు. ఈ దుర్ఘటన బంగ్లాదేశ్లో తాజాగా చోటుచేసుకుంది. బంగ్లా స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెంట్రల్ బంగ్లాదేశ్లోని పద్మ నదిలో ప్రయాణిస్తున్న రెండు పడవలు ఢీ కొన్నాయి. షిబ్చార్ పట్టణానికి సమీపంలోని పద్మ నదిలో సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవను ఇసుక రవాణా చేస్తున్న మరో ఓడ ఢీ కొట్టింది.
ఈ క్రమంలోనే ప్రయాణికుల పడవ బోల్తా కొట్టింది. ఈ విషాదకర ఘటనలో 26 మంది జల సమాధి అయ్యారు. మరో ఐదుగురిని స్థానికంగా ఉన్న అధికారులు రక్షించారు. అయితే, పడవలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై ఇంకా పూర్తి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతున్నదని వెల్లడించారు.
కాగా, బంగ్లాదేశ్లో పడవ ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయనీ, పేలవమైన నిర్వహణ, షిప్యార్డుల వద్ద భద్రతా ప్రమాణాల కొరత, రద్దీ సైతం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. గత నెల ప్రారంభంలోనూ సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవను పెద్ద కార్గో ఓడ ఢీకొట్టింది. గతేడాది జూన్లో ఫెర్రీ మునిగిపోయి 32 మంది మరణించారు. 2015 ఫిబ్రవరిలో కార్గో బోటును ఢీకొట్టడంతో 78 మంది మరణించారు.