Breaking
Sat. Jun 28th, 2025

Amalapuram: కోనసీమ ఘ‌ట‌న వెనుక ఉన్న‌ది వారే.. మంత్రి దాడిశెట్టి రాజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Konaseema protest: AP minister Dadishetti Raja alleges opposition conspiracy behind Amalapuram agitation

దర్వాజ-అమరావతి

Minister Dadisetti Raja: కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారులు ఏకంగా మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు పెట్టారు. ప్రస్తుతం అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. అమలాపురంతో పాటు కోనసీమలోని ముఖ్యమైన ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులను మోహరించారు. కాగా, ఈ ఘటనపై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం ఘటన వెనుక చంద్రబాబు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. గతంలో తుని ఘటనకు చంద్రబాబే కారణమని, ఇప్పుడు అమలాపురం ఘటనకు కూడా చంద్రబాబే కారణమన్నారు. ప్రజల కోరిక మేరకే కోనసీమ జిల్లా పేరు మార్చామని గుర్తు చేశారు. కుట్ర ప్రకారం మంత్రి ఇంటికి కూడా నిప్పు పెట్టార‌ని ఆరోపించారు.

రాష్ట్ర ప్ర‌జ‌ల గడపగడపకూ చేరువైన‌ వైసీపీ.. ప్రభుత్వం చేస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తున్నారని దాడిశెట్టి రాజా ఆరోపించారు. జై జన సేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారని తెలిపారు. ఆందోళనకారులను చంద్రబాబు, పవన్‌లు నడిపిస్తున్నారని దాడిశెట్టి రాజా ఆరోపిస్తూ, అల్లర్లకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

కాగా, ఆంధ‌ప్ర‌దేశ్ లోని కోనసీమ జిల్లా పేరు మార్చడంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమలాపురంలో ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు అధికారులతో సమావేశం అనంతరం జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ, 144 సెక్షన్‌ను అమలు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా జిల్లా పేరును మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కోనసీమ వాసులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోనసీమలో ఆందోళనలు చేపట్టారు. అమలాపురంలో ప్రజాప్రతినిధుల ఇళ్లను ఆందోళనకారులు ముట్టడించిన ఘటన కలకలం రేపింది. మరోవైపు అమలాపురం విధ్వంసం వెనుక ఉన్న శక్తులన్నింటినీ బయటకు తీస్తామని డీఐజీ పాలరాజు తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అమలాపురం విధ్వంసంపై డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అమలాపురంలో అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు.

Related Post