దర్వాజ-బెంగళూరు
Karnataka: కర్ణాటకలోని ఉడిపి జిల్లా పోలీసులు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసి కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో , మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్పకు క్లీన్ చిట్ ఇచ్చారు. సంతోష్ పాటిల్ ఈ ఏడాది ఏప్రిల్లో చనిపోయాడు. అయితే, తన స్నేహితులకు పంపిన మెసెజ్ లో మాజీ మంత్రి ఈశ్వరప్పనే తన చావుకు ఏకైక కారణమని ఆరోపించారు. ఇప్పుడు, ఉడిపిలోని పోలీసులు ‘బి’ రిపోర్ట్ను దాఖలు చేశారు. కాంట్రాక్టర్ ఆత్మహత్యలో ఈశ్వరప్ప పాత్ర ఉందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 11న కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మరణం కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో పోరాడవలసి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న కేఎస్ ఈశ్వరప్ప ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టర్ ఆత్మహత్యపై విచారణ ప్రారంభమైనప్పటికీ, ఈశ్వరప్పను ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదని మీడియా రిపోర్టుల సమాచారం.
మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్పతో పాటు ఆయనతో సంబంధం ఉన్నవారు సంతోష్ పాటిల్కు బెదిరింపులకు పాల్పడినట్లు రుజువులు లేవని పేర్కొంటూ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక ప్రజాప్రతినిధి కోర్టుకు పోలీసులు ‘బి’ రిపోర్టు సమర్పించారు. సీసీటీవీ విజువల్స్, ఆడియో క్లిప్పింగ్స్, పాటిల్ బ్యాంక్ స్టేట్మెంట్లు, కాంట్రాక్ట్ వివరాలు, అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల వాంగ్మూలాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. సంతోష్ మృతికి సంబంధించిన విచారణకు సంబంధించి పోలీసులు కనీసం 20 మంది మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు దాఖలు చేసిన నివేదికపై ఈశ్వరప్ప స్పందిస్తూ.. “పోలీసులు ‘బి’ రిపోర్ట్ను దాఖలు చేశారు. నేను అన్ని ఆరోపణల నుండి క్లియర్ అయ్యాను. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ మరణంలో విషయంలో వారు నా పాత్ర లేదని చెప్పారు. నేను అన్ని అభియోగాల నుండి విముక్తి పొందడం సంతోషంగా ఉంది” అని కెఎస్ ఈశ్వరప్ప శివమొగ్గలో విలేకరులతో అన్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం, సంతోష్ పాటిల్ భార్య పారదర్శక దర్యాప్తు కోరుతూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కేఎస్ ఈశ్వరప్పకు అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి తన రాజకీయ అధికారాన్ని, డబ్బును ఉపయోగించి దర్యాప్తును తనకు అనుకూలంగా ప్రభావితం చేశారని, ఆయన ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె లేఖలో ఆరోపించారు.
కాగా, రూ. 4 కోట్లతో 100 రోడ్ల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం తనకు కాంట్రాక్టు ఇచ్చిందని సంతోష్ పాటిల్ మరణానికి ముందు చెప్పాడు. అయితే, రెండేళ్లు గడిచినా, సంతోష్ బిల్లులు ఇప్పటికీ క్లియర్ కాలేదు. ఎందుకంటే ఇందులో మాజీమంత్రి ఈశ్వరప్ప 40% కోత వాటా కోరినట్టు కాంట్రాక్టర్ ఆరోపించారు. అయితే, సంతోష్ గురించి అస్సలు తెలియదని బీజేపీ నేత ఈశ్వరప్ప ఖండించారు. అలాగే, పరువు నష్టం కేసు నమోదుచేశారు.