Darvaaja-ముంబయి
MNS leader Raj Thackeray : మసీదులపై లౌడ్ స్పీకర్లు, మైకులకు సంబంధించిన వివాదం మరింతగా ముదురుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే రాజేసిన లౌడ్ స్పీకర్లు, మైకుల వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మసీదులపై మైకులను తొలగించాలనే దానిపై చాలా రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మరోసారి రాజ్ థాక్రే ప్రభుత్వాలను హెచ్చరించారు. ఔరంగాబాద్లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి మే 3 డెడ్లైన్కు కట్టుబడి ఉన్నామని తెలిపారు. లౌడ్ స్పీకర్లు తొలగించడానికి విధించిన గడువు తర్వాత కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. ఏం జరిగినా తనది బాధ్యత కాదని హెచ్చరించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని మత సమస్యగా మార్చాలనుకుంటే ఎంఎన్ఎస్ దానికి తగిన రీతిలో సమాధానం ఇస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. లౌడ్ స్పీకర్ల సమస్య సామాజిక సమస్య అని వెల్లడించారు. “మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి మే 3 గడువు తర్వాత అన్నింటికీ నేను బాధ్యత వహించను” అని రాజ్ థాక్రే అన్నారు. మే 3 న ఈద్ జరుపుకుంటారు. మేము ఆ వాతావరణాన్ని నాశనం చేయకూడదనుకుంటున్నాము. అయితే మే 4 నుంచి (మసీదుల నుంచి) లౌడ్స్పీకర్లను తొలగించకపోతే.. హిందువులందరూ ఆ మసీదుల ముందు రెట్టింపు పరిమాణంలో హనుమాన్ చాలీసా ప్లే చేయాలంటూ పిలుపునిచ్చారు.