అరే.. గీ రాజకీయం ఎన్నటికైనా కయ్యాలనే షురూ జేస్తది. గందుకే రాజకీయం అనేకంటే రాజకయ్యం అనాలేమో.. అప్పటిదాక మాములుగానే కనిపించే రాజకీయ నేతలు.. టక్కున మతి పోగొట్టే నిర్ణయం తీసుకుంటారు. దాంతో మిగతా నాయకలు పీక్కోలేక.. లాక్కోలేక సతమతమవుతుంటారు. అవును మళ్లా.. వ్యూహాలు వేయడంలోనే కాదు.. ఆ వ్యూహాలకు ప్రతివ్యూహాలు సృష్టించడంలో కూడా మన నేతలు లెస్స గ్రేటు. గందుకే గా కయ్యాలకు మాములు జనం బలి అవుతూ ఉంటారు.
ఇగ విషయానికి వస్తే.. దుబ్బాక, హైదరాబాద్ ఎన్నికల్లో భారీ ఓటమిని చవి చూసిన టీఆర్ ఎస్ నేతలు ఇప్పుడు ప్రతీ అడుగును రాజకీయంగా ఎంతో చాకచక్యంగా వేయాలని యోచిస్తున్నాట్లున్నారు. గందుకే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో టీఆర్ ఎస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా కొత్త వ్యక్తిని తమ అభ్యర్థిగా నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది.
“కింద పడ్డకాడే.. లేచి నిలబడి సూపియాలే..” అనే కన్సెప్ట్ ను టీఆర్ ఎస్ పెద్దసారు బాగా విశ్వసిస్తారు. ఆ ఫార్ములతోనే పెద్దసారు టీఆర్ ఎస్ ను ఇంత దూరం తీసుకురాగలిగారని ఎంతో మంది పెద్దల నమ్మకం. గిందులో ఆయన వ్యూహాలు ఎంతో బాగా పని చేస్తాయని చెబుతుంటారు. గదే సారు.. గీ దుబ్బాక, గా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో వ్యూహాలు వేశారో లేదో కానీ.. గీసారి మాత్రం సారు లెస్స గుస్సా మీద ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా గెలచి తీరాలని అనుకుంటున్నట్లున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ నామినేషన్ వేశారు. తాజాగా రాజకీయ అభివృద్ధిలో దూసుకుపోతున్న బీజేపీ నుంచి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశాడు. తమ మనుగడను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ నుంచి మాజీమంత్రి చిన్నారెడ్డి నామినేషన్ వేశాడు. ఇగ టీఆర్ ఎస్ ఇప్పటికే నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.
అటూ ఇటూ ఆలోచించి కాంగ్రెస్ ఓట్లను కూడా ఎత్తుకుపోయేందుకు సిద్దమైనట్లు అనిపిస్తోంది. అది ఎలా అంటే.. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి తమ పార్టీ అభ్యర్థిగా మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు కూతురైన వాణిదేవిని ఖరారు చేసింది. దీంతో ప్రతిపక్షాలకు మతి పోయి ఉంటది. మొన్నటిదాక ఎవరిని నిలబెట్టి.. “ఓడిన కాడ.. గెలిచి చూపిస్తారో..” అనుకున్న పలువురికి దీంతో సమాధానం ఇచ్చినట్లైంది. ఇది విన్న పెద్ద సారు అభిమానులు “కేసీఆరా.. మజాకా.. గిప్పుడు ప్రతిపక్షాలకు దిమ్మతిరిగి బొమ్మ కనబడుతది” అంటూ చమత్కరిస్తున్నారు.
అయితే పీవీ నరసింహారావు వారసులేవ్వరూ ఇప్పుడు రాజకీయాల్లో లేరు. చాలా కాలంగా వాళ్లు ఈ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఒకప్పుడు రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన వారి సమాజిక వర్గం ఇప్పుడు రాజకీయంగా కనుమరుగవుతోందని తెలుస్తోంది. ఆ వర్గం వాళ్లు కూడా రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారని.. ఆ సమయం కోసం కాచుకు కూర్చున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో కేసీఆర్ ఒక మాస్టర్ ప్లాన్ అయితే ముందే వేసి పెట్టుకున్నట్లున్నారు. ఆ ప్లాన్ లో భాగంగా పీ వీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా పెద్దసారు ఎవరూ ఊహించనట్లుగా పీవీ వారసుల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అక్కడితో ఆగకుండా తగినవిధంగా గౌరవిస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాడనే చెప్పాలి.

ఈ సమయంలో పీవీ కూతురు సురభి వాణిదేవిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తారని పలువురు భావించారు. ఇగ గప్పుడే దుబ్బాక ఉప ఎన్నిక వచ్చుడూ.. అటు వెంటనే జీహెచెఎంసీ ఎన్నికలు అవ్వుడుతో పెద్దసారు సైలెంట్ గా ఉన్నట్లున్నారు. ఇగ ఈ రెండు ఎన్నికల్లో పెద్దసారు పార్టీ భారీగా నష్టాన్ని చవి చూసిందని చెప్పాలి. దీంతో ఆ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన పలువురు సైలెంట్ గా ఉండిపోయారు. పెద్దసారు ఏది చెప్తే.. అది చేయాలని నిర్ణయించుకున్నట్లున్నారు.
ఇగ ఇదే సరైన సమయం అనుకున్న పెద్దసారు కేసీఆర్ పీవీ నరసింహారావు కుతురును వెంటనే తెరపైకి తీసుకొచ్చారు. ఈ సురభి వాణిదేవికి విద్యా సంస్థలు ఉన్నాయి. మాదాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు. ఈమె విద్యా రంగంలోనే కొనసాగుతుండడంతో ఈ పట్టభద్ర ఎమ్మెల్సీకి ఆమెనే సరైన అభ్యర్థి అని పెద్దసారు అంచనా వేసుకున్నట్లున్నారు. పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని చెబుతూనే.. వారి కుటుంబానికి, ఆ సామాజిక వర్గానికి టీఆర్ ఎస్ తగిన గుర్తింపు కల్పిస్తుందనే సెంటిమెంట్ తో ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది.
పీవీ వారసులకు మళ్లీ రాజకీయ ప్రవేశం కలిపించడంతో అటు కాంగ్రెస్ తోపాటు.. ఇటు బీజేపీని కూడా దెబ్బతీయొచ్చని.. పెద్దసారు భావిస్తున్నట్లు ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఇగ జీఎచ్ ఎంసీ ఎన్నికల వేడి ఇంకా తగ్గక ముందే.. ఈ పట్టభద్ర ఎన్నికల యుద్ధం షురూ కావడంతో మళ్లీ ఎన్నికల కయ్యం మొదలైందనే చెప్పాలి. ఈ వ్యూహాలతో టీఆర్ ఎస్ అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి.. “కింద పడ్డకడే నిలబడి చూపించాం” అని చెబుతుందా? లేక మళ్లీ బొక్కబోర్ల పడి సైలెంట్ అయిపోతుందా ? అనేది వేచి చూడాలి.

ఏది ఏమైనా టీఆర్ ఎస్ ఇప్పుడు అసహనంలో ఉందని చెప్పాలి. ఆ రెండు ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడమే దీనికి కారణం. ఇంకో విషయం.. ఇప్పుడు కూడా టీఆర్ ఎస్ గట్టిగా గెలుస్తామనే నమ్మకంతో లేదని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇవి మాములు ఎన్నికల్లా కావని వారికి తెలుసు. ఇప్పటికే ఉద్యోగాలు లేక తెలంగాణ పట్టభద్రులు ఆగ్రహంతో ఉన్నారు.
గీ టైంలో టీఆర్ ఎస్ కు వాళ్లు ఓట్లు వేయకపోవచ్చు. ఈ ముచ్చట అటు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు, ఇటు బీజేపీకి సానుకులంగా మారొచ్చు. ఇక దీన్ని పెద్దసారు ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. ఇప్పుడు పెద్దసారు ముందల రెండు పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఒకటి ప్రతిపక్ష నాయకులను ఎదుర్కోవడం, మరోటి పట్టభద్రులను తమకు ఓటేసేలా చేసుకోవడం. ఈ సమయంలో పెద్దసారు మరేం వ్యూహాన్ని పన్నుతారోననే దానిమిదే.. అందరి దృష్టి పడింది.
వాట్సాప్ లో ఇక మెసేజ్ చేయలేరు !
టీవీ, మొబైల్స్.. డెంజర్లో టీనేజర్స్ !
కోమలమైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!
కడుపునొప్పి, విరోచనాలు అయితే వెంటనే జాగ్రత్త పడాల్సిందే..!