దర్వాజ-న్యూఢిల్లీ
Monkeypox-ICMR : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న క్రమంలో భారత వైద్య పరిశోధన మండలి (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR).. కీలక వ్యాఖ్యలు చేసింది. మంకీపాక్స్ వైరస్ బారిన పడే ప్రమాదం పిల్లల్లో ఎక్కువగా ఉందని తెలిపింది. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకైతే భారత్ లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదని ఐసీఎంఆర్ తెలిపింది. స్థానికేతర దేశాలలో పెరుగుతున్న అంటువ్యాధుల దృష్ట్యా దేశం సిద్ధంగా ఉందని అన్నారు.
వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ICMR శాస్త్రవేత్త డాక్టర్ అపర్ణ ముఖర్జీ మాట్లాడుతూ.. “పిల్లలు మంకీపాక్స్ ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఎక్కువ అవకాశం ఉంది. వృద్ధులకు మశూచి వ్యాక్సిన్ వేస్తారు. 1980ల తర్వాత, ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పోరాడేందుకు క్రాస్-ఇమ్యూనిటీని ఇచ్చే మశూచి వ్యాక్సిన్ని పొందని వ్యక్తులు, కాబట్టి యువకులు ఎక్కువ దీని బారినపడే అవకాశముందని” అని అన్నారు. అయితే, మంకీపాక్స్ సోకిన వారికి దగ్గరగా సంబంధాలు కలిగివుంటేనే ఇది సోకుతుందనీ, తీవ్ర భయాందోళనకు ప్రజలు గురికావద్దని తెలిపారు.
కాగా, ప్రస్తుతం మంకీపాక్స్ కేసులు USA, UK, బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, ఆస్ట్రేలియా, కెనడా, ఆస్ట్రియా, కానరీ దీవులు, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్తో సహా కొన్ని స్థానికేతర దేశాలలో గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మంకీపాక్స్ కేసులు పెరుగుదల నేపథ్యంలో ప్రపంచ దేశాలు నివారణ చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరముందని పేర్కొంది.