దర్వాజ-ముంబై
Anant Ambani’s Wedding’ X Post for Bomb: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12న ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. ఇంకా పెళ్లీ వేడుకలు కొనసాగుతున్నాయి. అయితే, అనంత్ అంబానీ, రాధికల పెళ్లిపై అనుమానాస్పద ‘బాంబు’ పోస్ట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. దీంతో అంబానీ పెళ్లిలో బాంబు ఉందని చెప్పిన ఎక్స్ (ట్విట్టర్) యూజర్ గుర్తింపును నిర్ధారించడానికి ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ పోస్ట్ బయటకు రావడంతో వెంటనే పోలీసులు పెళ్లి వేదిక చుట్టూ భద్రతను పెంచారు.
బాంబు బెదిరింపు ఫేక్..
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, ముంబై పోలీసు అధికారి ఒకరు ఈ పోస్ట్ గురించి పోలీసులకు తెలుసునని, కానీ అది ఫేక్ అని చెప్పారు. అయితే పోలీసులు ఎలాంటి అవకాశం తీసుకోకుండా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం చేసుకున్న బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
అనంత్-రాధిక పెళ్లి గురించి ఎక్స్ యూజర్ ఏం రాశాడు?
@FFSFIR ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చిన పోస్టులో ‘అంబానీ పెళ్లిలో బాంబు పేలితే సగం ప్రపంచం తలకిందులవుతుందని సిగ్గులేని ఆలోచన నా మదిలో మెదిలింది’ అని ఉంది. ఈ ట్వీట్ బయటకు రావడంతో ముంబై పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వివాహ వేదిక వద్ద భద్రతను పెంచారు.
నో ఎఫ్ఐఆర్.. కానీ దర్యాప్తు కొనసాగింపు
కాగా, ఈ పోస్టు నేపథ్యంలో ముంబై పోలీసులు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, అయితే ట్వీట్ పోస్ట్ చేసిన వ్యక్తి, దాని వెనుక అతని ఉద్దేశ్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పోలీసులు ఆ పోస్టును తప్పుడు కేసుగా భావించినప్పటికీ ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
శుక్రవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీకేసీలోని పెళ్లి వేదిక, పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే, ఆదివారం జరిగిన రిసెప్షన్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పోస్టు పుకార్లేనని, అయితే సోషల్ మీడియా పోస్ట్ చూసిన పోలీసు బృందం కచ్చితంగా దర్యాప్తు చేస్తుందని పోలీసు అధికారి తెలిపారు.
అనుమతి లేకుండా పెళ్లి వేదికపైకి ప్రవేశించిన ఇద్దరి అరెస్ట్
అనుమతి లేకుండా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహానికి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను యూట్యూబర్ వెంకటేష్ నరసయ్య అల్లూరి (26), వ్యాపారవేత్తగా గుర్తించిన లుక్మాన్ మహ్మద్ షఫీ షేక్ (28)గా గుర్తించారు. వీరిద్దరిపై ముంబై పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు కేసుల్లో చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసులు నోటీసులు ఇచ్చి నిందితులను విడుదల చేశారు. నిందితులు వేర్వేరు గేట్ల గుండా లోపలికి ప్రవేశించినప్పటికీ వారి అనుమానాస్పద కదలికలను గమనించిన భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Team India New Captain : హార్దిక్ పాండ్యాకు టెన్షన్ పెంచిన శుభ్మన్ గిల్