తగ్గుతున్న జనాభా.. పెరుగుతున్న రక్తహీనత
• దేశంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు
• ప్రతినలుగురు ఆడపిల్లల్లో ఒకరికి బాల్యవివాహం
• సగం మంది మహిళలు, పిల్లల్లో రక్తహీనత
• జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 నివేదికలో ప్రధానాంశాలు..
దర్వాజ-న్యూఢిల్లీ
NFHS-5 : భారత్లో ఒక వైపు సంతానోత్పత్తి రేటు క్షీణిస్తుండగా మరోవైపు రక్తహీనత పెరుగుతోందని తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే, దేశంలో గత కొన్నేండ్లుగా జనాభా సైతం తగ్గుముఖం పడుతున్నదని ఈ నివేదిక అంశాలు గమనిస్తే తెలుస్తోంది. ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదికలో ప్రస్తావించిన ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుముఖం పడుతోంది. 2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, 2015-16లో నివేదించబడిన వివరాలతో పోలిస్తే సంతానోత్పత్తి రేటు 2.2 నుంచి 2.0కు పడిపోయంది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటివరకు నమోదైన అత్యల్పస్థాయి ఇదేనని ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదిక పేర్కొంది.
రీప్లేస్మెంట్ రేటు (జనన, మరణాలను బ్యాలెన్స్ చేసే స్థాయి) 2.1 కంటే సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది. దేశంలో సంతానోత్పత్తి రేటు అంతకంటే తక్కువగా ఉండటంతో జనాభా తగ్గుదల ప్రారంభమైందని సర్వే చెబుతోంది. గతంలో 1998-99లో సంతానోత్పత్తి రేటు 3.2గా ఉంది. అంటే అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవితకాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాటిలో నేటి పరిస్థితులతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఆధుని గర్భనిరోధక పద్ధతుల వాడకం పెరగడమే కారణమని చెబుతున్నారు.
తగ్గిన అంతరం..
సంతానోత్పత్తి రేటులో పట్టణ, గ్రామీణ అంతరం కూడా తగ్గింది. తాజా సర్వేలో పట్టణ ప్రాంతాలకు TFR 1.6 ఉండగా, గ్రామీణ ప్రాంతాలకు 2.1 గా ఉంది. కేవలం ఐదు రాష్ట్రాలు భర్తీ స్థాయిని మించి TFRని కలిగి ఉన్నాయి. వాటిలో బీహార్ (3.0), మేఘాలయ (2.9), ఉత్తరప్రదేశ్ (2.4), జార్ఖండ్ (2.3) మణిపూర్ (2.2)లు ఉన్నాయి. ఇక నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్ లు 2015-16 నుంచి TFRలో గరిష్ట క్షీణతను నమోదు చేశాయి. పట్టణ గ్రామీణ అంతరం కూడా ఆయా రాష్ట్రాల్లో అధికంగా ఉంది.
ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒక బాల్యవివాహం
కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అధిక సంతానం, పిల్లల ఆరోగ్యం, మహిళల తక్కువ సామాజిక స్థితి వంటి అంశాలు బాల్య వివాహాలను ప్రేరేపిస్తున్నాయి. దేశంలో బాల్యవివాహాలు గతంలో కంటే తగ్గినప్పటికీ ఇంకా ప్రతి నలుగురు ఆడపిల్లల్లో ఒకరికి ఇంకా 18 ఏండ్లు నిండకుండానే వివాహం జరుగుతోందని సర్వే గుర్తించింది. ఐదేండ్ల క్రితం వీరి సంఖ్య 26.6శాతంగా ఉండగా.. 2019-21లో 23.3శాతాకి చేరింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పొల్చి చూస్తే అంతరాలు అధికంగానే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 20-24 ఏళ్లలోపు 15 శాతం మంది మహిళలు 18 ఏండ్లు నిండకముందే పెళ్లి చేసుకుంటే, గ్రామీణ ప్రాంతాల్లో 27 శాతంగా ఉన్నారు. బెంగాల్, బీహార్లలోనే దాదాపు 41 శాతం.
పెరుగుతున్న రక్త హీనత
దేశంలో రక్తహీనత అధికం అవుతుండటం కూడా ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదికలో ప్రధానాంశంగా ఉంది. మహిళలు , పిల్లల్లో సగం మంది రక్త హీనతతో బాధపడుతున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. 2015-16లో 53%తో పోలిస్తే 2019-21లో 15-49 ఏండ్ల వారిలో 57% మంది మహిళలు రక్తహీనతతో ఉన్నారు. అదే పురుషుల్లో 22.7% నుంచి 25%కి పెరిగింది. ఆరు నెలల్లోపు పిల్లలకు పాలు ఇస్తున్న తల్లులు 2015-16లో 55 శాతం ఉండగా, ప్రస్తుతం 64 శాతానికి పెరిగింది. మొత్తంగా జనాభా మాత్రం పెరగకుండా, తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నదని ఎన్ఎఫ్హెచ్ఎస్-5 నివేదిక పేర్కొంది.
మరిన్ని కథనాలు :
ఫ్యాషన్ వేర్ లో కేక పుట్టిస్తున్న శృతి హాసన్
బాబాయ్ పూజా హెగ్డే ఎంజాయ్ మాములుగా లేదు..
పీరియడ్స్ టైం లో తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!
Adani: అంబానీని వెనక్కి నెట్టిన అదానీ
Farm Laws: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..
Katrina Kaif: ‘రోడ్లు.. కత్రీనా కైఫ్ బుగ్గల్లా నున్నగా ఉండాలి’
Share this content: