దర్వాజ-బెంగళూరు
కర్నాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చకు ఎట్టకేలకు తెరపడింది. కర్నాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై ఎన్నికయ్యారు. మంగళవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి కర్నాటక బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి.కిషన్రెడ్డి హాజరయ్యారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజు బొమ్మై.. రాష్ట్ర మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడు కావడం గమనార్హం. యడియూరప్పకు ఆయన సన్నిహితుడుగా పేర్కొంటారు.
కాగా, 1998లో జనతాదళ్ పార్టీలో చేరి బసవరాజు బొమ్మై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన 1998, 2004లో జనతాదల్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన 2008లో బీజేపీలో చేరారు. ఇప్పటివరకు ఆయన యడియూరప్ప మంత్రి వర్గంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు. తాజా బీజేఎల్పీ సమావేశంలో సభా నాయకుడిగా ఎన్నికయ్యారు. రెండు మూడు రోజుల్లో బసవరాజు బొమ్మై రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు సమాచారం.