దర్వాజ-న్యూఢల్లీ
Justice DY Chandrachud : మహిళలకు రాజ్యాంగం కల్పించిన న్యాయపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరముందని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ‘న్యాయ అవగాహన-మహిళా సాధికారత’ అనే అంశంపై మాట్లాడారు. ఈ క్రమంలోనే ఒక లెస్బియన్ జంట కర్వాచౌత్ జరుపుకుంటున్నట్టు చూపిన డాబర్ యాడ్ గురించి ప్రస్తావించారు. ప్రజా అసహనం కారణంగా తన యాడ్ను డాబర్ తొలగించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మహిళా హక్కులపై చట్టపరమైన అవగాహన కల్పించడం ఎందుకు ముఖ్యమో అనే దాని గురించి మాట్లాడుతూ డాబర్ యాడ్ గురించి ప్రస్తావించారు.
‘‘మన రాజ్యాంగం.. పితృస్వామ్యంతో పాతుకుపోయిన అసమానతలను తొలగించడానికి ప్రయత్నించే నిర్మాణ పరివర్తనాత్మక పత్రం. మహిళల భౌతిక హక్కులు, గౌరవం, సమానత్వం బహిరంగంగా పొందేందుకు ఇది శక్తివంతమైన సాధనం’’ అని అన్నారు. కాగా, జస్టిస్ డీవై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం ఇదివరకు మహిళలకు ఆర్మీలో అవకాశాలు, శాత్వత కమిషన్ ఏర్పాటు వంటి కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నేతృత్వంలోని మరో ధర్మాసనం 39 మంది మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని గత నెలలో కేంద్రాన్ని ఆదేశించింది.
డాబర్ యాడ్ గురించి..
డాబర్ యాడ్లో ఇద్దరు అమ్మాయిలు కార్వాచౌత్ కోసం రెడీ అవుతూ.. ఓ అమ్మాయి తన ముఖంపై బ్లీచింగ్ ను ఫేస్ మాస్క్లా రాసుకుంది. వీరిద్దరూ కార్వాచౌత్ గురించి మాట్లాడుకుంటుండగా, ఇంతలో మరో మహిళ వారి దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు చెబుతూ శారీలు ఇచ్చింది. చివరకు ఇద్దరు అమ్మాయిలూ… సంప్రదాయబద్ధంగా కార్వాచౌత్ జరుపుకున్నారు. ఆ ఇద్దరూ భార్యాభర్తల లాగా… జల్లెడలో ఎదురెదురుగా ముఖాలు చూసుకున్నారు. సంప్రదాయంలో భాగంగా ఇద్దరూ నీరు తాగారు. తద్వారా ఈ ఇద్దరు భార్యాభర్తలు అనే విషయం తెలుస్తుంది. దీనిపై ఓ వర్గం నుంచి వ్యతిరేకత రావడంతో డాబర్ కంపెనీ యాడ్ను ఉపసంహరించుకుంది.